ముంబై,(ఆరోగ్యజ్యోతి): మహారాష్ట్రలోని ముంబైలో నోవెల్ కరోనా వైరస్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ పరదేశీపై బదిలీ వేటు వేశారు. ప్రవీణ్ స్థానంలో అదనపు ప్రధాన కార్యదర్శి ఇక్బాల్ సింగ్ చాహాల్ను నియమించారు. ముంబై మహానగరంలో ఇప్పటి వరకు 11394 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దాంట్లో 437 మంది మరణించారు. ముంబై కమిషనర్ ప్రవీణ్.. ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శిగా ట్రాన్స్ఫర్ అయ్యారు. ముంబై అదనపు మున్సిపల్ కమిషనర్గా ఉన్న అబ్బాసాహెబ్ జరహద్ను కూడా సీఎం బదిలీ చేశారు. ట్రాన్స్ఫర్ ఆర్డర్లపై సీఎం సంతకం చేసినా.. ఆ ఆదేశాలను ఇంకా జారీ చేయలేదని తెలుస్తోంది.