టెన్త్‌ పరీక్షలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి)‌: తెలంగాణలో టెన్త్‌ పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. జూన్‌ మొదటివారం తర్వాత టెన్త్‌ పరీక్షలు నిర్వహించుకోవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు విచారణ చేపట్టింది. టెన్త్ పరీక్షలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు కోర్టుకు ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద అన్ని చర్యలు తీసుకుంటామని అడ్వొకేట్ జనరల్ బీఎస్.ప్రసాద్ హామీ ఇచ్చారు. జూన్‌ 3న పరిస్థితిని సమీక్షించి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. అప్పటికీ కేసుల తీవ్రత పెరిగితే.. పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు వెల్లడించింది. ప్రతీ పరీక్షకు రెండు రోజుల వ్యవధి ఉండాలని స్పష్టం చేసింది. అలాగే పరీక్షలు రాసే విద్యార్థులకు హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోర్టు సూచించింది. దీనిపై చర్యలు చేపడతామని ప్రభుత్వం తెలిపింది.ఇదిలా ఉంటే ఏపీలో మాత్రం జూలైలో టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది. కరోనా తీవ్రతను బట్టి షెడ్యూల్ ప్రకటిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. కరోనా కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు వాయిదా పడుతూ వచ్చాయి. ఇలాంటి తరుణంలో ఎగ్జామ్స్  కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు తెలంగాణ హైకోర్టు గుడ్‌న్యూస్ చెప్పింది. వచ్చే నెలలోనే పరీక్షలు నిర్వహించాలని పచ్చజెండా ఊపింది.