సావోపౌలో: మనిషికి రెండు మూత్రపిండాలు (కిడ్నీలు) ఉంటాయని అందరికీ తెలిసిందే. అయితే బ్రెజిల్కు చెందిన 38 ఏండ్ల వ్యక్తికి మాత్రం విచిత్రంగా మూడు మూత్ర పిండాలు ఉన్నాయి. ఇటీవల తరుచూ వెన్నునొప్పి వస్తుండటంతో అతడు సావోపౌలోలోని ఓ దవాఖానకు వెళ్లారు. పరీక్షించగా అతడికి వెన్నుపూసలో సమస్యతోపాటు.. మూడు మూత్రపిండాలున్నట్టు డాక్టర్లు గుర్తించారు. ఇది అత్యంత అరుదని, వైద్య చరిత్రలో ఇప్పటివరకు మూడు మూత్రపిండాలున్న వ్యక్తులు వందమందిలోపే ఉన్నారని చెప్పారు. అతడికి ఎడమవైపు మూత్రపిండం మామూలుగానే ఉన్నదని, కుడివైపు మాత్రం మూత్రాశయానికి సమీపంలో రెండు చిన్న మూత్రపిండాలు ఉన్నాయని చెప్పారు. పిండం ఎదుగుతున్న సమయంలో ఏదైనా కారణం వల్ల మూత్రపిండాలు రెండుగా విడిపోతే ఇలా జరుగుతుందని నిపుణులు తెలిపారు. ప్రస్తుతం అతడికి ఎలాంటి ఇబ్బంది లేదని, వెన్నునొప్పి తగ్గడానికి మందులు ఇచ్చామని చెప్పారు