న్యూఢిల్లీ: కరోనాకు త్వరలో కారు చవక పరీక్ష 'ఫేలూదా' రాబోతున్నది. మహాదర్శకుడు సత్యజిత్ రాయ్ సృష్టించిన కాల్పనిక డిటెక్టివ్ పాత్ర పేరు దీనికి పెట్టారు. నిజానికి దానిపేరులోని పదాల మొదటి అక్షరాలను కలిపితే కూడా 'ఫేలూదా'నే వస్తుంది. ఇది చవకైనదే కాకుండా సత్వరమైనది కూడా. దీని ఫలితాలు గంటసేపటిలో వస్తాయి. ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీకి చెందిన సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ దేబోజ్యోతి చక్రబర్తి, డాక్టర్ సౌవిక్ మైతీ ఈ సరికొత్త కరోనా పరీక్షను రూపొందించారు. మరో నాలుగు వారాల్లో ఇది అందుబాటులోకి వస్తుందని అంచవేస్తున్నారు. డీఎన్ఏ, రసాయనాలు రెండింటిని ఈ పరీక్షలో వినియోగిస్తారు. 'ఫేలూదా'లో కాగితపు స్ట్రిప్ ఉంటుంది. దానిపై శాంపిల్ రాస్తే ఫలితం తెలుసుకోవచ్చు. ఈ పరీక్షలో సీఏఎస్-9 ప్రొటీన్ ఆధారంగా ఫలితాలు తెలిసిపోతాయి. దీనికి అత్యాధునికమైన లెవెల్-2, లెవెల్-3 ల్యాబులు అవసరం లేదు. మామూలు పాథాలజీ ల్యాబులు సరిపోతాయి. ల్యాబ్ టెక్నీషియన్లకు దీని ఉపయోగంపై సులభంగానే తర్పీదు ఇవ్వవచ్చు. తద్వారా దేశవ్యాప్తంగా సులభ పరీక్షలు అందుబాటులోకి వస్తాయి.