జెనీవా: కరోనా విశ్వమారి ఎప్పటికీ కనుమరుగు కాకపోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) పేర్కొంది. ఎప్పటిలోపు కట్టడి చేయగలమన్న విషయాన్ని చెప్పడం సాధ్యంకాదని తెలిపింది. డబ్ల్యూహెచ్వో హెల్త్ ఎమర్జెన్సీ అధిపతి డాక్టర్ మైఖెల్ రియాన్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘కొవిడ్-19 ఎప్పటికీ కనుమరుగు కాకపోవచ్చు. వ్యాక్సిన్ లేకుండా ఈ మహమ్మారిని అడ్డుకునే రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ప్రజలకు ఏండ్ల సమయం పడుతుంది.వివిధ వైరస్లతో జీవిస్తున్నట్టుగానే దీనితో కలిసి జీవించాల్సి రావొచ్చు’ అని అన్నారు. హెచ్ఐవీ వ్యాధి లాగానే ఇది కూడా కనుమరుగు కాకపోవచ్చన్న ఆయన సమర్థమంతమైన చికిత్సను అందించి వ్యాధితో సహజీవనం చేస్తూ ప్రజల్ని కాపాడుకోవచ్చని తెలిపారు. కాగా, వైరస్ పట్ల కొంతమంది నిరాశతో ఉన్నట్టు తాను గమనించానని డబ్ల్యూహెచ్వో ఏర్పాటు చేసిన కొవిడ్-19 విభాగం సాంకేతికత నిపుణురాలు మారియా వార్ కెర్ఖోవ్ తెలిపారు. వ్యాక్సిన్ లేకుండానే ఈ మహమ్మారిని నియంత్రించవచ్చని, కొన్ని దేశాల్లో వైరస్ అదుపులోనే ఉన్నదని ఆమె వెల్లడించారు.