కరోనాయోధులకు కమ్మని భోజనం



నిజామాబాద్‌, (ఆరోగ్యజ్యోతి) : నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా లాక్‌డౌన్‌లో అత్యవసర సేవలందిస్తున్న సిబ్బందికి నాణ్యమైన భోజనం సమకూరుస్తున్నారు. ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ పర్యవేక్షణలో 35 రోజులుగా నిత్యం 1,500 మందికి పార్సిళ్ల ద్వారా కమ్మని భోజనం అందిస్తున్నారు. రోజూ వెరైటీ కూరల భోజనంతోపాటు మినరల్‌ వాటర్‌ బాటిల్‌, బిస్కెట్‌ ప్యాకెట్లను జూట్‌ బ్యాగుల్లో సరఫరా చేస్తున్నారు. వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపల్‌ సిబ్బంది, పోలీసు, రెవెన్యూ సిబ్బంది, జర్నలిస్టులు, ఆశవర్కర్లు, అంగన్‌వాడీలు, ఇతర అత్యవసర విభాగాల ఉద్యోగులకు ఎమ్మెల్యే బిగాల.. ప్రత్యేక శ్రద్ధతో భోజన వసతి కల్పిస్తున్నారు. లాక్‌డౌన్‌ తొలిరోజుల్లో కలెక్టరేట్‌ చౌరస్తాలో గణేశ్‌గుప్తా నిలబడి అత్యవసర సేవలందిస్తున్న సిబ్బందికి సెల్యూట్‌చేసివారి సేవలను కొనియాడారు. తన పుట్టినరోజున, మేడే సందర్భంగా సిబ్బందికి  స్వీటు బాక్సులు పంపిణీ చేశారు. నిజామాబాద్‌లో కంటైన్మెంట్‌ క్లస్టర్లలో ఎమ్మెల్యే తరచూ పర్యటిస్తూ.. బాధిత కుటుంబాలకు, స్థానికులకు మనోధైర్యం నిం పుతున్నారు. లాక్‌డౌన్‌ ఉన్నంతకాలం ఈ సేవను కొనసాగిస్తానని ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా తెలిపారు.