యూకేలో కరోనాతో భారత సంతతి డాక్టర్‌ మృతి

లండన్‌: బ్రిటన్‌లో వైద్యురాలిగా పనిచేస్తున్న భారత సంతతి వైద్యురాలు పూర్ణిమా నాయర్‌ (56) బుధవారం కన్నుమూశారు. కరోనా వైరస్‌ సోకిన ఆమె గత కొంతకాలంగా అక్కడే చికిత్స పొందుతున్నారు. శ్వాససంబంధ లక్షణాలతో గత నెల 27న స్టాక్‌టన్‌లోని నార్త్‌టీస్‌ యూనివర్సిటీ దవాఖానలో చేరారు. రెండువారాలుగా అక్కడే చికిత్స పొందారు. 1987 లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీబీఎస్‌ పూర్తిచేసిన పూర్ణిమా నాయర్‌.. 1997 లో ఉన్నత చదువుల నిమిత్తం బ్రిటన్‌ వెళ్లి కౌంటీ దుర్హమ్‌లో జనరల్‌ ప్రాక్టీషనర్‌గా స్థిరపడ్డారు. తామొక విలువైన వైద్యురాలిని కోల్పోయామని కౌంటీ దుర్హమ్‌ ప్రజలు, సహచర వైద్యులు విచారం వ్యక్తంచేశారు. బ్రిటన్‌లో ఇప్పటివరకు కరోనా వైరస్‌ బారినపడి 12 మంది భారత సంతతి వైద్యులు చనిపోయారు.