ఢిల్లీ : విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడారు. విశాఖపట్నం పరిస్థితిపై సమాచారం అడిగి తెలుసుకున్న ప్రధాని అన్ని రకాల సహాయ సహకారాలను, మద్దతు అందజేయనున్నట్లు తెలిపారు. అంతకుక్రితం విశాఖ గ్యాస్ లీక్పై ప్రధాని మోదీ హోంమంత్రిత్వ శాఖ అధికారులు అదేవిధంగా జాతీయ విపత్తు నిర్వహణ అథారిటి అధికారులతో మాట్లాడారు. విశాఖవాసుల క్షేమం కోరుతూ ప్రార్థిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. విశాఖలో పరిస్థితిపై సమీక్షించేందుకు ప్రధాని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటి అధికారులతో ఈ ఉదయం 11 గంటలకు సమావేశం కానున్నారు. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో రసాయనిక గ్యాస్ విడుదలై ఎనిమిది మంది మృతిచెందారు. పలువురు అపస్మారకస్థితిలోకి వెళ్లారు. రసాయనిక గ్యాస్ తీవ్రత 2.5 కిలోమీటర్ల పరిధిలో వ్యాపించింది. సహాయక చర్యలను ముమ్మరం చేసిన అధికారులు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.