ఈ ఘటన కెన్యాలోని మోంబసా కౌంటీలో గల ఓ గ్రామంలో వెలుగుచూసింది...కరోనా ఏమో కానీ దానికన్నా ముందే కటిక దారిద్ర్యం పేదవారి ప్రాణాలు తీసేలా ఉంది. ఇంట్లో సరుకులు లేక, పిల్లల కడుపు నింపలేక పేద తల్లిదండ్రులు కళ్ల నుంచి రక్తం కారుస్తున్నారు. ఓవైపు ఆకలిమంట.. మరోవైపు కన్నబిడ్డలకు తిండిపెట్టలేక పేగుమంట.. వెరసి ఓ తల్లి, లేని అన్నం వండుతున్నట్లు పిల్లలను మాయ చేస్తూ నిద్ర పుచ్చుతోంది. ఆమెకు 8 మంది పిల్లలు. ఇళ్లల్లో పనిచేసి పిల్లలను పోషించుకునేది. లాక్డౌన్తో ఆమె కు ఉపాధి కరువైంది. ఇంట్లో పిడికెడు తిండిగింజలు కూడా లేవు. ఆకలికి తట్టుకోలేక పిల్లలు ఏడుస్తుంటే నీళ్లున్న ఓ పాత్రను పొయ్యిమీద పెట్టి, అందులో రాళ్లు వేసి ఉడికించిందా తల్లి. అమ్మ ఏదో వండుతోందని, కడుపు నిండా తింటామన్న ఆశతోనైనా వారు ఏడుపు ఆపేస్తారనే ఆశతోనే ఇలా రాళ్లను ఉడికించా నన్నది ఆ నిస్సహాయురాలు. గుండెలను ద్రవింపజేసే ఈ ఘటన కెన్యాలోని మోంబసా కౌంటీలో గల ఓ గ్రామంలో వెలుగుచూసింది. కిట్సావో అనే మహిళ భర్త గత ఏడాది ఓ దోపిడీదారు చేతిలో హత్యకు గురయ్యాడు. 8 మంది పిల్లలతో కరెంటు, నీళ్లు లేని ఓ ఇంట్లో కిట్సావో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తోంది. పిల్లల ఏడ్పు విని పొరుగింటి వ్యక్తి వెళ్లి చూసే సరికి ఆమె రాళ్లు ఉడికిస్తోంది. ఆ కుటుంబం దయనీయస్థితిని ఆయన మీడియా దృష్టికి తీసుకెళ్లడంతో బయటి ప్రపంచానికి తెలిసింది. చలించిపోయిన కెన్యా ప్రజలు, ఆమె బ్యాంకు ఖాతాలో డబ్బు లు వేస్తున్నారు. కిట్సావోకు ఫోన్లు చేసి ఏం సాయం కావాలన్నా చేస్తామని చెబుతున్నారు. దేశ ప్రజలు తన పట్ల ఇంత ఔదార్యాన్ని స్పందిస్తారని తాను ఊహించలేదు అని ఆమె ఆనందం వ్యక్తం చేసింది.