ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ అమలు నేపథ్యంలో జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ రూ.20 లక్షల కోట్లతో ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. వివిధ వర్గాలకు ఆర్థికంగా ఊతమిచ్చేందుకు ఈ ప్రత్యేక ప్యాకేజీ దోహదపడుతుందని ఆయన చెప్పారు. ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌’ పేరుతో ఆర్థిక ప్యాకేజీని రూపొందించినట్లు తెలిపారు. ఆర్థిక ప్యాకేజీ భారత జీడీపీలో 10 శాతమని, ల్యాండ్‌, లేబర్‌, లా, లిక్విడిటీలకు బలం చేకూర్చేలా ప్యాకేజీ ఉండనుందని మోదీ స్పష్టం చేశారు. ప్యాకేజీతో సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు ఊతమిస్తున్నట్లు ఆయన తెలిపారు.నూతన ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు ఈ ప్యాకేజీ దోహదపడుతుందని, ప్యాకేజీకి సంబంధించిన వివరాలను ఆర్థిక మంత్రి బుధవారం వెల్లడిస్తారని ప్రధాని ప్రకటించారు. ప్రతి పారిశ్రామికుల్ని కలుపుకొనిపోయేలా ప్యాకేజీ ఉంటుందని ప్రధాని మోదీ వెల్లడించారు. సర్కార్‌ నుంచి వెళ్లే ప్రతి రూపాయి ప్రతి శ్రామికుడు, రైతు జేబులోకి వెళ్తుందని మోదీ ప్రకటించడం విశేషం. 21వ శతాబ్ధపు ఆకాంక్షలకు తగినట్లు ప్యాకేజీ రూపకల్పన చేసినట్లు మోదీ ప్రకటించారు. సంఘటిత, అసంఘటిత కార్మికులందర్నీ ప్యాకేజీతో ఆదుకుంటామని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు.