తెలంగాణలో కొత్తగా పది కరోనా పాజిటివ్‌ కేసులు

హైదరాబాద్‌ : తెలంగాణలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. వైరస్‌ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. కేసుల సంఖ్యమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. గడిచిన 24 గంటల్లో పది పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 1132కి చేరిగింది. వైరస్‌ కారణంగా ఇప్పటి వరకు 29 ​మంది మృతి చెందగా.. 722 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 376 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర  ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేంద​ర్‌ హెల్త్‌ బులిటిన్‌ను విడుదల చేశారు.అనంతరం మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి సరిహద్దుల్లోనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని మంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు. రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయగలిగామని చెప్పారు. ప్రతిరోజు సీఎం కేసీఆర్‌ కరోనాపై సమీక్ష చేస్తున్నారని విలేకరుల సమావేశంలో మంత్రి వివరించారు. గాంధీ, ఉస్మానియాలో అన్ని సేవలు కొనసాగుతాయి. పాజిటివ్‌ కేసులు వచ్చిన ఇళ్లలో కరోనా నిబంధనలు తప్పకుండా పాటిస్తున్నాం. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ముందు జాగ్రత్తలు తీసుకుని సేవలు కొనసాగించాలని సూచించాం. కరోనా పరీక్షలు చేయడం లేదన్న ఆరోపణల్లో నిజం లేదు.  75ఏళ్లు దాటిన వ్యక్తి, డయాలసిస్‌ రోగి కూడా కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అవుతున్నారు. కరోనా సోకిన గర్బిణీ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.  మన వైద్యులు గొప్పగా పనిచేస్తున్నారని చెప్పేందుకు ఇదే ఉదాహరణ.' అని చెప్పారు. 'కరోనా పరీక్షలు చేయడం లేదనే ఆరోపణలు అబద్ధమని కేంద్రానికి చెప్పాం. సూర్యాపేట, వరంగల్‌(అర్బన్‌), నిజామాబాద్‌ జిల్లాలను ఆరెంజ్‌ జోన్‌లో చేర్చాలని కేంద్రాన్ని కోరాం. కంటైన్మెంట్‌ జోన్లలో కరోనాను అరికట్టేందుకు చర్యలు చేపట్టాం. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మాత్రమే రెడ్‌జోన్లుగా ఉన్నాయని' మంత్రి పేర్కొన్నారు.