కరోనా పీడ వదిలేదెప్పుడు? ఇప్పుడు అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న ఇదే. మహమ్మారి వేల మంది ప్రాణాలను కబళిస్తున్న నేపథ్యంలో వైరస్కు విరుగుడు కనిపెట్టేందుకు 100కుపైగా పరిశోధన బృందాలు రేయింబవళ్లు కష్టపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిశోధనలు ఎందాకా వచ్చాయి? ఏ సంస్థలు ముందంజలో ఉన్నాయి? మన దేశంలో పరిస్థితేంటి? తదితర అంశాలపై ప్రత్యేక కథనం..
సినోవాక్ బయోటెక్
తమ వ్యాక్సిన్ను కోతులపై విజయవంతంగా ప్రయోగించినట్లు చైనా ప్రకటించింది. ఆ దేశానికి చెందిన సినోవాక్ బయోటెక్ కంపెనీ... పికోవాక్ పేరిట వ్యాక్సిన్ను అభివృద్ధి చేసింది. ఈ వ్యాక్సిన్ ఇచ్చిన కోతులు వైరస్ బారినపడలేదని తెలిపింది. ప్రస్తుతం మనుషులపై వ్యాక్సిన్ను పరీక్షిస్తున్నారు.
మోడర్న
అమెరికాలోని మసాచుసెట్స్కు చెందిన బయోటెక్ కంపెనీ మోడర్న.. ఆర్ఎన్ఏ వ్యాక్సిన్ను అభివృద్ధిచేస్తున్నది. దీనికోసం ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్సియస్ డిసీజెస్'తో జట్టుకట్టింది.ఎఆర్ఎన్ఏ-1273 పేరిట రూపొందించిన ఈ వ్యాక్సిన్ తొలి దశ ట్రయల్స్ పూర్తయ్యాయి.
ఫిజర్, బయోఎన్టెక్
అమెరికాకు చెందిన ఫిజర్ ఫార్యాస్యూటికల్ కంపెనీ, జర్మనీకి చెందిన బయోఎన్టెక్ కంపెనీ సంయుక్తంగా 4 వ్యాక్సిన్లపై పరిశోధనలు చేస్తున్నాయి. వీటిపై ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించాయి.
ఇనోవియో ఫార్మాస్యూటికల్స్
అమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందిన ఇనోవియో ఫార్మాస్యూటికల్స్ సంస్థ ఐఎన్వో-4800 పేరుతో వ్యాక్సిన్ను అభివృద్ధి చేసింది. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో తొలి దశ ట్రయల్స్ను త్వరలోనే నిర్వహించనుంది.
బీసీజీ వ్యాక్సిన్
టీబీ నియంత్రణకు వినియోగించే బీసీజీ వ్యాక్సిన్పైనా పరిశోధనలు జరుగుతున్నాయి. కరోనాను ఇది అడ్డుకోగలదా అన్నది పరీక్షించేందుకు క్లినికల్ ట్రయల్స్ను నిర్వహిస్తున్నారు.
భారత్లో పరిస్థితి ఏమిటి?
వ్యాక్సిన్ను అభివృద్ధి చేసేందుకు ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్' (ఐసీఎంఆర్), భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (బీబీఐఎల్) జతకలిశాయి. పుణేలోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ’లో (ఎన్ఐవీ) వేరుచేసిన వైరస్ స్ట్రెయిన్ను వ్యాక్సిన్ అభివృద్ధికి ఉపయోగించనున్నారు. మరోవైపు, పుణేలోని ‘సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ)’.. ఆక్స్ఫర్డ్ వర్సిటీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నది. ఇందులోభాగంగా ఎస్ఐఐ 60మిలియన్ డోసుల వ్యాక్సిన్ను ఉత్పత్తిచేయనుంది.
ఆక్స్ఫర్డ్ వర్సిటీ
బ్రిటన్లోని ‘యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్'..‘సీహెచ్ఏడీఓఎక్స్1 ఎన్సీవోవీ-19’ పేరిట వ్యాక్సిన్ను అభివృద్ధి చేసింది. ఇందులో అడెనోవైరస్కు చెందిన స్ట్రెయిన్ను కొవిడ్-19 వైరస్ జన్యు పదార్థంతో కలిపారు. ఈ వ్యాక్సిన్పై రెండోదశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహి స్తున్నారు.