కొత్త రూపంలో నాలుగో దశ లాక్‌డౌన్‌ : ప్రధాని మోదీ

న్యూఢిల్లీ : దేశంలో నాలుగోసారి లాక్‌డౌన్‌ విధించబోతున్నామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. నాలుగో దఫా లాక్‌డౌన్‌ వివరాలు ఈ నెల 18 లోపు వెల్లడిస్తామని మోదీ చెప్పారు. నాలుగో దశ లాక్‌డౌన్‌ కొత్త రూపంలో ఉంటుందన్నారు. లాక్‌డౌన్‌ సడలింపులు, కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి మంగళవారం రాత్రి మాట్లాడారు. ఈ నెల 17తో మూడో దశ లాక్‌డౌన్‌ గడువు ముగియనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి దేశంలో నాలుగోసారి లాక్‌డౌన్‌ విధించబోతున్నట్లు మోదీ ప్రకటన చేశారు. కరోనా వైరస్‌ మన జీవితంలో ఒక భాగమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ మన జీవితాలను కరోనా వైరస్‌ చుట్టూ పరిమితం కానివ్వలేము అని మోదీ అన్నారు. కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రతి ఒక్కరం మాస్కులు కట్టుకుందాం.. ఆరు అడుగుల దూరం పాటిద్దామని మోదీ పిలుపునిచ్చారు. ఈ విధంగా చేస్తే కరోనాను సాధ్యమైనంత వరకు అరికట్టవచ్చు అని మోదీ తెలిపారు.