అమరావతి : విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన తనను చాలా బాధ కలిగించిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. గ్యాస్ లీకేజీ వల్ల అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... గ్యాస్ లీక్ ఘటన బాధాకరమన్నారు. మంచి ప్రమాణాలు పాటించే ప్రముఖ కంపెనీ ఎల్జీ పాలిమర్స్లో ఈ ఘటన జరగడం బాధాకరమన్నారు. ఘటనపై అధ్యయనం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జరిగిన దుర్ఘటనపై లోతుగా అధ్యయనం చేసి కమిటీ నివేదిక ఇస్తుందన్నారు. నివేదిక పరిశీలిన అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
ఒక్కో కుటుంబానికి రూ. కోటి ఎక్స్గ్రేషియా..
గ్యాస్ లీకేజీ ఘటనలో మృతిచెందిన ఒక్కో కుటుంబానికి రూ. కోటి ఎక్స్గ్రేషియాగా ఇవ్వనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఆస్పత్రుల్లో వెంటిలేటర్ మీద ఉన్నవాళ్లకు రూ. 10 లక్షలు, చికిత్స పొందుతున్న వారికి రూ. లక్ష, ప్రాథమిక చికిత్స పొందిన వారికి రూ. 25 వేలు నష్టపరిహారంగా అందించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఒక్కో జంతువుకు రూ. 25 వేలు నష్టపరిహారం ఇవ్వనున్నట్లు చెప్పారు. బాధిత గ్రామాల్లోని 15 వేల మందికి ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున అందిస్తామన్నారు. బాధిత కుటుంబాలకు ఎల్జీ కంపెనీలో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. మంత్రి కన్నబాబు సహా మరికొందరు మంత్రులు ఇక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించనున్నట్లు తెలిపారు. ఘటన జరిగాక వెంటనే స్పందించిన అధికారులకు సీఎం జగన్ అభినందనలు తెలిపారు. ఉదయం 4.30 గంటలకే కలెక్టర్, డీసీపీ చేరుకుని ప్రమాద స్థలంలో సహాయ చర్యలు చేపట్టారన్నారు. 340 మందికి పైగా స్థానికులను ఆస్పత్రులకు తరలించారని.. వందల సంఖ్యలో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సీఎం పేర్కొన్నారు. లీకైన గ్యాస్ ప్రభావం కొన్ని రోజులపాటు ఉంటుందన్నారు. వెంకటాపురం, ఎస్సీ, బీసీ కాలనీ, నందమూరి నగర్, పద్మనాభపురంలో ఈ ప్రభావం కనిపిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో అవసరమైతే కంపెనీని అక్కడి నుంచి తరలిస్తామని పేర్కొన్నారు.