బడిగంటపై చర్చోపచర్చలు


  • జూన్‌ 12 నుంచే పాఠశాలలు ప్రారంభం?

  • తరగతి గదిలో 20 మందికే పరిమితం


నిర్ణీత దూరం, మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరి l లాక్‌డౌన్‌ పొడిగిస్తే.. విద్యాక్యాలెండర్‌లో మార్పులుహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వేసవి సెలవులు ఇంకా నెలకంటే ఎక్కువే ఉండటంతో వచ్చే విద్యాసంవత్సరం జూన్‌ 12 నుంచే ప్రారంభిస్తామనే అభిప్రాయాన్ని విద్యాశాఖవర్గాలు వ్యక్తంచేస్తున్నాయి. లాక్‌డౌన్‌ నెలాఖరువరకు పొడిగించినా విద్యాసంవత్సరం ప్రారంభానికి ఆటంకం ఉండకపోవచ్చని తెలుస్తున్నది. యథావిధిగా తరగతులు ప్రారంభించి.. 220 పనిదినాలు పూర్తిచేయాలని రాష్ట్ర విద్యాశిక్షణ పరిశోధనా సంస్థ (ఎస్సీఈఆర్టీ) అధికారులు యోచిస్తున్నా రు. రాష్ట్రంలో కొవిడ్‌-19 నెలాఖరులోగా పూర్తిగా నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నామని, విద్యాసంవత్సరాన్ని యథావిధిగా అమలుచేయాలనే యోచనలో ఉన్నామని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌ బీ శేషుకుమారి తెలిపారు.


వైరస్‌ వ్యాపి కట్టడికి చర్యలు తప్పనిసరి


కరోనా అదుపులోకి వచ్చి పాఠశాలలు ప్రారంభమైనా వైరస్‌వ్యాప్తి నియంత్రణ చర్యలు కొనసాగుతాయని అధికారులు పేర్కొంటున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు నిర్ణీతదూరం పాటించడంతోపాటు, తరగతిగదిలో 20కి మించి విద్యార్థులు ఉండకుండా చర్యలు చేపట్టాలని యోచిస్తున్నారు.  రోజు లో పనిగంటల్లో మార్పులు తేవాలా? లేక రోజు విడి చి రోజు తరగతులు నిర్వహించాలా? అనే అంశంపై త్వరలో స్పష్టత రానున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు గదుల కొరత వల్ల రొటేషన్‌ పద్ధతే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టెన్త్‌ పరీక్షలపై లాక్‌డౌన్‌ సడలింపు తర్వాతే.. ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనున్నది. లాక్‌డౌన్‌ పొడిగిస్తే విద్యాక్యాలెండర్‌పై నిపుణుల కమిటీ ఏర్పాటుచేసి తుదినిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని చెప్తున్నారు. ప్రైవేటు స్కూల్‌ యాజమాన్యాలకు కూడా నిర్ణీతదూ రం పాటించేవిధంగా ఆదేశాలివ్వనున్నారు.