పెరుగుతున్న కోవిడ్ కేసులు.. గుజ‌రాత్‌కు ఎయిమ్స్ చీఫ్‌

గుజ‌రాత్‌లో క‌రోనా వైర‌స్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్ర‌స్తుతం ఆ రాష్ట్రంలో 7402 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. 449 మంది మ‌ర‌ణించారు. గుజ‌రాత్‌లో ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉండ‌డంతో.. ఆ రాష్ట్ర సీఎం విజ‌య రూపానీ ఢిల్లీ నుంచి డాక్ట‌ర్ల‌ను రప్పిస్తున్నారు.  ఎయిమ్స్ చీఫ్ డాక్ట‌ర్ ర‌ణ్‌దీప్ గులేరియాతో పాటు మ‌రో ఇద్ద‌రు డాక్ట‌ర్లు హుటాహుటిన గుజ‌రాత్ బ‌య‌లుదేరి వెళ్లారు.  భార‌త వైమానిక ద‌ళానికి చెందిన ప్ర‌త్యేక విమానంలో డాక్ట‌ర్ గులేరియా గుజ‌రాత్ వెళ్లారు. అక్క‌డ ఆయ‌న అహ్మాదాబాద్ సివిల్ హాస్పిట‌ల్‌లో కోవిడ్ పేషెంట్ల‌కు చికిత్స అందిస్తున్న డాక్ట‌ర్ల‌తో మాట్లాడ‌నున్నారు.  వారికి కోవిడ్‌కు సంబంధించిన చికిత్సా విధానం గురించి తెలియ‌జేయ‌నున్నారు.  ఇత‌ర రుగ్మ‌త‌లు ఉన్న‌వారికి క‌రోనా సోకితే అది మ‌రింత ప్ర‌మాద‌క‌రంగా మారుతుంద‌ని డాక్ట‌ర్ గులేరియా అన్నారు. వృద్ధులు ఉన్న ఇండ్ల‌ల్లో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌న్నారు. పాజిటివ్ వ‌చ్చిన త‌ర్వాత వెంట‌నే హాస్పిట‌ల్‌లో చేరాల‌న్నారు. స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉన్నా.. త‌క్ష‌ణ‌మే క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌న్నారు. ఢిల్లీ అపోలో హాస్పిట‌ల్‌కు చెందిన డాక్ట‌ర్ రాజేశ్ చావ్లా, ముంబైకి చెందిన ప్ర‌ఖ్యాత ప‌ల్మోన‌లాజిస్ట్ డాక్ట‌ర్ రోహిత్ పండిట్‌ను కూడా గుజ‌రాత్‌కు పంపించాల‌ని ఆ రాష్ట్ర సీఎం రూపానీ కేంద్రాన్ని కోరారు