ఫైర్‌ సర్వీస్‌ వ్యానులో ప్రసవించిన గర్భిణీ


భువనేశ్వర్‌(ఆరోగ్యజ్యోతి) : అంఫన్‌ తుపాన్‌ ప్రభావంతో గాలివానలో ఒక మహిళ అగ్నిమాపక వ్యానులో ప్రసవించింది. ఒడిశాలోని కేంద్రపరా జిల్లాకు చెందిన జానకీ సేథి అనే మహిళ పురిటినొప్పులతో బాధపడుతోంది. గాలివానకు రోడ్లపై చెట్లు పడిపోవడంతో అంబులెన్స్‌ వెళ్లేందుకు అవకాశం లేదని ఉదయం 9 గంటలకు మహాకాలపద అగ్నిమాపకశాఖ కార్యాలయానికి ఆమె కుటుంబసభ్యులు ఫోన్‌ చేశారు. దీంతో అగ్నిమాపకశాఖ అధికారులు రెండు వ్యాన్లు తీసుకొని ఆమె ఇంటికి చేరుకున్నారు. మహిళను వ్యాన్‌లో ఎక్కించుకుని 22 చెట్లను పవర్‌ సా సాయంతో తొలగిస్తూ ఆస్పత్రికి తీసుకెళుతున్నారు. మార్గమధ్యంలోనే ఆమె ఆడబిడ్డను ప్రసవించింది. అనంతరం ఆస్పత్రికి తరలించామని, తల్లి బిడ్డా క్షేమంగానే ఉన్నారని అధికారులు తెలిపారు. కాగా, తుఫాన్‌ సమయంలో వెంటనే స్పందించిన అగ్నిమాపకశాఖ అధికారులు, సిబ్బందికి వారు కృతజ్ఞతలు తెలిపారు.