న్యూఢిల్లీ,(ఆరోగ్యజ్యోతి): ప్రధాని నరేంద్రమోదీ నివాసంలో మే 20న (బుధవారం) ఉదయం 11 గంటలకు కేంద్ర క్యాబినెట్ సమావేశం కానుంది. ప్రధాని అధ్యక్షతన జరుగనున్నఈ సమావేశంలో దేశంలో కరోనా పరిస్థితి, నాలుగో విడత లాక్డౌన్ అమలు జరుగుతున్న తీరు, కరోనా కట్టడికి మే 31 తర్వాత అనుసరించాల్సిన విధానం తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. గత వారం ప్రధాని మోదీ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీపై వస్తున్న ఫీడ్ బ్యాక్పై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది. ఇక కరోనా వైరస్ నియంత్రణా చర్యలు, వలస కార్మికుల తరలింపు కారణంగా ఉత్పన్నమైన పరిణామాలపై కూడా క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉన్నది. రోడ్డు రవాణాకు దాదాపుగా ఆమోదం తెలిపిన కేంద్ర క్యాబినెట్ రైలు, విమానయానంపై మాత్రం మే 31 వరకు నిషేధం కొనసాగిస్తున్నది. అయితే, డొమెస్టిక్ విమానాలను నడపాలన్న డిమాండ్ బలపడుతుండటంతో రేపటి క్యాబినెట్ భేటీలో ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరుగుతున్నది.