ఊర్లలో కరోనా టెస్టులు చేస్తున్రు

హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కరోనా ర్యాండమ్ టెస్టులు చేస్తోంది. ఇండియన్​ కౌన్సిల్ ​ఆఫ్ ​మెడికల్​రీసెర్చ్(ఐసీఎంఆర్), నేషనల్ ​ఇనిస్టిట్యూట్ ​ఆఫ్​ న్యూట్రిషన్(ఎన్ఐఎన్) ఆధ్వర్యంలో సెరోలాజికల్ సర్వేను చేపట్టింది. మన రాష్ట్రం నుంచి ఎంపిక చేసిన నల్గొండ, కామారెడ్డి, జనగాం జిల్లాల్లో శుక్రవారం 600 శాంపిళ్లను సేకరించింది. ఐసీఎంఆర్, ఎన్ఐఎన్ బృందాలు జిల్లాకు 400 శాంపిళ్ల చొప్పున మొత్తం 1200 మంది నుంచి రక్త నమూనాలు సేకరించనున్నాయి. తొలి రోజు జిల్లాకు 200 చొప్పున 600 సేకరించగా, శనివారం మరో 600 సేకరించనున్నారు. జిల్లాకు10 గ్రామాలను ఎంపిక చేసి మొత్తం 30 గ్రామాల్లో ఈ సర్వే చేస్తున్నారు. తొలి రోజు ఆయా జిల్లాల్లోని 5 గ్రామాల్లో పరీక్షలు నిర్వహించారు. 18 ఏళ్లు పైబడిన వారినే టెస్టులకు ఎంచుకుంటున్నారు. ఒక్కో జిల్లాలో 5 టీమ్స్ టెస్టులు నిర్వహిస్తుండగా, స్థానిక మెడికల్ సిబ్బందికి సహాయం అందజేస్తున్నారు. శాంపిళ్లను సోమవారం చెన్నైకి పంపించనున్నట్లు అధికారులు తెలిపారు. అక్కడ రోగ నిరోధక శక్తికి సంబంధించి ఎలీసా టెస్టు చేస్తారని చెప్పారు. ఈ నెల 25 వరకు రిపోర్టులు అందుతాయని పేర్కొన్నారు.