- రాత్రి 7 గంటల వరకే ఆర్టీసీ సేవలు
- ఆరు వేల బస్సులే అందుబాటులోకి
హైదరాబాద్, (ఆరోగ్యజ్యోతి): సుదీర్ఘ లాక్డౌన్ తర్వాత మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి ఆర్టీసీ బస్సులు తిరిగి పరుగు పెట్టబోతున్నాయి. బస్సుల్లో పాత చార్జీలే వసూలు చేస్తారు. ప్రయాణికులపై ఎలాంటి అదనపు భారం ఉండదు. రాత్రి 7 గంటల వరకే ఆర్టీసీ సేవలు అందుబాటులో ఉంటాయి. లాక్డౌన్తో కార్పొరేషన్లో ఉన్న 10,460 బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నాలుగోసారి లాక్డౌన్ పొడిగింపు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థకు అనుమతించింది. యాభై శాతం సీట్ల భర్తీతో బస్సులు నడపొచ్చని కేంద్ర ప్రభుత్వం చెప్పినా చివరకు నిర్ణయాధికారం రాష్ట్రాలకే వదిలేసింది. రాష్ట్ర కేబినెట్లో ఈ అంశం చర్చకు వచ్చినపుడు యాభై శాతం సీట్లతో బస్సులను నడపాలంటే చార్జీలు పెంచాల్సి వస్తుందని అధికారులు నివేదించారు. ఈ నేపథ్యంలో మొత్తం సీట్లకు ప్రయాణికులను అనుమతించాలని నిర్ణయించారు.సీట్లు నిండాక స్టాండింగ్కు మాత్రం అనుమతించరు. ప్రతి బస్సును డిపోలో శానిటైజ్ చేశాకే.. బయటకు పంపుతారు. బస్టాండ్ల వద్ద కూడా ప్రయాణికులకు హ్యాండ్ శానిటైజర్లను అందుబాటులో పెడతారు. మాస్కులు లేని ప్రయాణికులను బస్సుల్లోకి అనుమతించరు. హైదరాబాద్ నగరానికి చెందిన నాలుగు వేల బస్సులు డిపోల్లోనే ఉంటాయి. మిగతా జిల్లాలకు చెందిన ఆరు వేల బస్సులే అందుబాటులోకి వస్తాయి. హైదరాబాద్కు వచ్చే బస్సులన్నీ నగర సరిహద్దుల్లోనే నిలిచిపోతాయి. జేబీఎస్, హయాత్నగర్, ఉప్పల్, ఆరాంఘర్ నుంచి మాత్రమే రాకపోకలు సాగిస్తాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల నుంచి వచ్చే ప్రయాణికులను జేబీఎస్ వద్దే దింపేస్తారు.సూర్యాపేట, నల్లగొండ జిల్లాలు, యాదాద్రి-భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులను హయాత్నగర్ వరకు అనుమతిస్తారు. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్-భూపాలపల్లి, ములుగు, జనగాం, యాదాద్రి-భువనగిరి జిల్లాల నుంచి వచ్చే బస్సులకు ఉప్పల్ వరకు అనుమతి ఉంటుంది. ఉమ్మడి మహబూబ్నగర్ నుంచి వచ్చే ప్రయాణికులను ఆరాంఘర్ చౌరస్తా వద్ద దింపేస్తారు.