నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డికి కరోనా

డిచ్‌పల్లి(ఆరోగ్యజ్యోతి): నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. రెండురోజుల క్రితమే జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని బాజిరెడ్డి గోవర్ధన్‌ హైదరాబాద్‌లో కలిసి కొద్దిసేపు మాట్లాడారు. శనివారం ఉదయం డిచ్‌పల్లి మండలం బీబీపూర్‌తండాలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు ప్రారంభించేందుకు వచ్చిన బాజిరెడ్డి కార్యక్రమం ముగిసిన తర్వాత నిజామాబాద్‌కు వెళ్లారు. సాయంత్రం దవాఖానకు వెళ్లి నమూనాలు ఇచ్చారు. ఆదివారం ఉదయం పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన ఆదివారం సాయంత్రం స్వయంగా వాహనం నడుపుకుంటూ హైదరాబాద్‌ దవాఖానకు వెళ్లారు. బాజిరెడ్డి కుటుంబసభ్యులు హోంక్వారంటైన్‌లో ఉన్నారు.