ఢిల్లీ,(ఆరోగ్యజ్యోతి):రానున్న 15 రోజుల్లో ఢిల్లీలో సుమారు 30 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. ఒక వ్యక్తికి వైరస్ సోకితే, అతను ఆ వైరస్ నుంచి కోలుకునేందుకు రెండు వారాల సమయం పడుతుందని, ఆ సమయంలో అతను కనీసం పది మంది వరకు వైరస్ను అంటిస్తారని, ఆ రకంగా ప్రస్తుత పరిస్థితి ఆధారంగా అంచనా వేస్తే, రానున్న 12 లేదా 15 రోజుల్లో.. ఢిల్లీలో సుమారు 30 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కానున్నట్లు మంత్రి సత్యేంద్ర జైన్ చెప్పారు. హాస్పిటళ్లలో బెడ్స్ సంఖ్యను రెండు వేల చొప్పున పెంచాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ లెక్కల ప్రకారం జూన్ చివర వరకు సుమారు 15వేల బెడ్స్ అవసరం ఉంటుందని సత్యేంద్ర జైన్ అన్నారు. అవసరం అయితే బ్యాంకెట్ హాల్స్, హోటళ్లు, స్టేడియంలను కూడా కరోనా వ్యాధిగ్రస్తుల కోసం వినియోగించనున్నట్లు మంత్రి తెలిపారు. దేశంలో మాత్రం ప్రస్తుతం వైరస్ సంక్రమణ జరుగుతోందని, కానీ అది సమూహా వ్యాప్తా కాదా అన్న విషయాన్ని మాత్రం కేంద్ర ప్రభుత్వమే తేల్చాల్సి ఉంటుందని ఆయన అన్నారు.