న్యూఢిల్లీ,(ఆరోగ్యజ్యోతి): కరోనా లాక్డౌన్ కారణంగా మార్చి 16 నుంచి దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. లాక్డౌన్ ఆంక్షలు సడలించడంతో ఆగస్టు తర్వాత స్కూళ్లు, కాలేజీలు పునఃప్రారంభించనున్నట్లు కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ఓ ఇంటర్యూలో తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 33కోట్ల మంది విద్యార్థులు పాఠశాలలు ఎప్పుడు ఓపెన్ చేస్తారా? అని ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 15 తర్వాత స్కూళ్లు ఓపెన్ చేసేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని తెలిపారు. ఆగస్టు 15లోగా ఈ సెషన్(ఈఏడాది)లోని పరీక్షల ఫలితాలన్నింటిని ప్రకటించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఇంతకుముందు జరిగిన పరీక్షలు, ఇప్పుడు జరుగుతున్న పరీక్షల ఫలితాలను త్వరగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. సీబీఎస్ఈ ఎగ్జామ్స్ జూలై 1 నుంచి జూలై 15 మధ్య జరగనుండగా..ICSE/ISC పరీక్షలు జూలై 1 నుంచి జూలై 12 వరకు నిర్వహించనున్నారు. ఇప్పటికే నీట్, జేఈఈ పరీక్షల షెడ్యూల్ను కూడా విడుదల చేశారు.