తెలంగాణలో కొత్తగా 154 కరోనా కేసులు నమోదు

- ఇప్పటివరకూ 3,650 మందికి కరోనా పాజిటివ్‌


హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి:‌  హైదరాబాద్: తెలంగాణలో కరోనా మరణ మృదంగం వాయిస్తోంది. ఇప్పటివరకూ కరోనా పాజిటివ్ కేసులే భయపెడితే.. ఇప్పుడు పెరుగుతున్న మరణాల సంఖ్య కూడా బెంబేలెత్తిస్తోంది. వారం క్రితం వరకూ కూడా తక్కువగా ఉన్న ఈ సంఖ్య.. ఒక్కసారిగా పెరగడంపై తెలంగాణ వ్యాప్తంగా భయాందోళన వ్యక్తమవుతోంది. తాజాగా నమోదైన కేసులు.. పోయిన ప్రాణాల సంఖ్య తెలుసుకుంటే వణుకు పుడుతోంది. ఆదివారం ఒక్క రోజే 154 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 14 మంది మృతి చెందారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 132, రంగారెడ్డి 12, మేడ్చల్‌ 3, యాదాద్రి 2, సిద్దిపేట, మహబూబాబాద్‌, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్‌, కరీంనగర్‌లో ఒక్కో కేసు నమోదు అయింది. ఇప్పటివరకూ 3,650 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా మొత్తం 137 మంది మృతి చెందారు. ఇంకా 1,771 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ 1,742 మంది డిశ్చార్జ్‌ అయ్యారని తెలంగాణ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.