జహీరాబాద్(ఆరోగ్యజ్యోతి): సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఒకే కుటుంబానికి చెందిన 19 మందికి కరోనా సోకడం కలకలం రేపుతోంది. జహీరాబాద్కు చెందిన 55 ఏళ్ల మహిళ ఈ నెల 9న హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో అనారోగ్య లక్షణాలతో చికిత్స పొందుతూ మృతి చెందింది. అదే రోజు రాత్రి జహీరాబాద్లో సదరు మహిళకు అంత్యక్రియలు నిర్వహించారు. ఆ మరుసటి రోజు సాయంత్రానికి మృతురాలికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ అధికారులు మృతురాలికి దగ్గరగా ఉన్న కుటుంబీకులు, బంధువులను గుర్తించి మిర్జాపూర్(బి) ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. 25 మంది నమూనాలను పరీక్షలకు పంపగా శుక్రవారం రాత్రి 19 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. కరోనా సోకిన వారిలో చిన్నారులు, మహిళలు, పురుషులు ఉన్నారు. పాజిటివ్గా వచ్చిన వారిని సంగారెడ్డిలోని జిల్లా ఆస్పత్రికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా మహిళ అంత్యక్రియల్లో సుమారు 40 మంది పాల్గొని ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. వారందరినీ గుర్తించేందుకు వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో కొవిడ్ పాజిటివ్ వచ్చిన ప్రాంతాన్ని అధికారులు రెడ్ జోన్గా ప్రకటించి రాకపోకలపై పూర్తిగా నిషేధం విధించారు.