తెలంగాణకు మిడతల దండు ప్రమాదం పొంచి ఉంది: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: రాష్ట్రానికి మిడతల దండు ప్రమాదం మరోసారి పొంచి ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌  ఆదేశించారు. మిడతల దండు నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టినట్లు సీఎం పేర్కొన్నారు. మిడతల దండు నుంచి రాష్ట్రాన్ని కాపాడే చర్యలపై ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. మిడతల దండు గమనంపై సమాచారాన్ని తెప్పించుకొన్న సీఎం అధికారులతో చర్చించారు.  'గత నెలలో మూడు విడతలుగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ వరకు మిడతలు వచ్చాయి. తెలంగాణ వైపు మిడతలు రాలేదు.  తాజాగా ఓ మిడతల దండు తెలంగాణ సమీపంలోకి వచ్చింది. రాష్ట్రానికి 200 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్రలోని రాంటెక్‌ దగ్గర అజ్ని అనే గ్రామం దగ్గర ప్రస్తుతం మిడతల దండు ఉంది. దాని ప్రయాణం దక్షిణం వైపు సాగితే చాలా తక్కువ సమయంలో తెలంగాణలోకి ప్రవేశించే ప్రమాదం ఉందని' సీఎం వివరించారు. ఈ నెల 20 నుంచి జూలై 5 వరకు మిడతలు వచ్చే అవకాశం ఉన్నది. మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాల సరిహద్దులోని 8 జిల్లాలు అప్రమత్తంగా ఉండాలి. భద్రాచలం, చర్ల, వెంకటాపురం, వాజేడు, పేరూరు, మంగపేట, ఏటూరు నాగారం, చెన్నూరు, వేమనపల్లి, కౌటాల, ధర్మాబాద్‌, బోధన్‌, జుక్కల్‌, బాన్సువాడ, నారాయణఖేడ్‌, జహీరాబాద్‌ ప్రాంతాల నుంచి మిడతల దండు వచ్చే ప్రమాదం ఉంద'న్నారు. 'భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మంచిర్యాల, ఆదిలాబాద్‌, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు అలర్ట్‌గా ఉండాలి. ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనించి చర్యలు తీసుకోవాలి.  మిడతల దండు దాడి చేసిందంటే చాలా నష్టం. లేత పంటను పీల్చి పారేస్తుంది..ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలోకి మిడతల దండు ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని' అధికారులకు సీఎం కేసీఆర్‌ సూచించారు.