న్యూయార్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతున్నది. ప్రాణాంతకమైన ఈ మహమ్మారి ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలకు విస్తరించడంతో పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య రోజ రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 71,93,476 మంది ఈ వైరస్ బారినపడ్డారు. ఇందులో 4,08,614 మందికిపైగా బాధితులు మరణించారు. చైనాలో జన్మించిన ఈ వైరస్ బారినపడినవారిలో 35,35,554 మంది కోలుకోగా, మరో 32,49,308 మంది చికిత్స పొందుతున్నారు. ఇక కరోనా కేసుల్లో అగ్రస్థానంలో ఉన్న అమెరికాలో గత 24 గంటల్లో 18,663 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,26,493కి పెరిగింది. అమెరికాలో ఇప్పటివరకు 1,13,055 మంది బాధితులు మరణించారు. మరో 7,73,480 మంది కోలుకోగా, 11,39,958 మంది చికిత్స పొందుతున్నారు.
లాటిన్ అమెరికా దేశమైన జ్రెజిల్లో కరోనా వైరస్ విళయతాండవం చేస్తున్నది. దేశంలో కొత్తగా 18,925 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 7,10,887కి చేరింది. ఈ వైరస్ ప్రభావంతో 37,312 మంది మరణించారు. దేశవ్యాప్తంగా 3,47,973 యాక్టివ్ కేసులు ఉండగా, 3,25,602 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
మూడోస్థానంలో ఉన్న రష్యాలో కరోనా మరణాలు తక్కువగానే ఉన్నప్పటికీ, పాజిటివ్ కేసులు మాత్రం ప్రతి రోజు ఎనిమిది వేల పైచిలుకు నమోదవుతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో 8,900 పాజిటివ్ కేసులు నమోదవడంతో, మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,76,658కి పెరిగింది. రష్యాలో ఇప్పటివరకు 5971 మంది మరణించారు. నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్న స్పెయిన్లో 2,88,797 పాజిటివ్ కేసులు నమోదవగా, యూకేలో 2,87,399 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ దేశాల్లో ఇప్పటివరకు 27,136 మంది, 40597 మంది ఈ వైరస్ కారణంగా మృతిచెందారు.
గత ఆరు రోజులుగా 9 వేల పైచిలుకు పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో, ప్రపంచంలో అత్యధిక కేసులు రికార్డవుతున్న దేశాల జాబితాలో భారత్ ఆరో స్థానంలో కొనసాగుతున్నది. దేశంలో ఇప్పటివరకు 2,65,928 పాజిటివ్ కేసులు నమోదవగా, 7473 మంది మరణించారు.