వైద్యులపై దాడులు దురదృష్టకరం: ఈటల


 హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి)‌: వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులు జరగడం దురదృష్టకరమని మంత్రి ఈటల  రాజేందర్   అన్నారు. ఇలాంటి దాడులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని, దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం ఆయన జూడాలతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మంత్రిఈటల  రాజేందర్  మాట్లాడుతూ.. ‘కరోనా సమయంలో డాక్టర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఇతరుల ప్రాణాలు కాపాడుతున్నారు. రోజుల తరబడి ఇంటికి వెళ్లకుండా పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారు. ఇలా త్యాగం చేసి సమాజం కోసం పనిచేస్తున్న వారి మీద దాడులు చేయడం హేయమైన చర్య. ఇలాంటి సంఘటనలు ఎట్టి పరిస్థితుల్లో సహించం’అని అన్నారు. దాదాపు నాలుగు గంటల పాటు జూనియర్‌ డాక్టర్లతో చర్చించి వారి సమస్యలను సానుకూలంగా విన్నారు. హాస్పిటల్‌ డీసెంట్రలైజేషన్‌ అంశంపై సీఎం కేసీఆర్‌తో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. జూడాల కమిటీతో ప్రతి వారం గాంధీలోనే సమావేశమవుతానన్నారు. చర్యల తర్వాత జూడాలు ఆందోళన విరమించారని, ఈ సందర్భంగా వారికి ధన్యవాదములు తెలుపుతున్నామని మంత్రి పేర్కొన్నారు.