హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి):రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు, మరోవైపు వైద్యులూ వైరస్ బారిన పడుతుండటం కలవరానికి గురిచేస్తున్నది. వైరస్ దశలు మారుతున్నట్లు వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 55 రకాలుగా వైరస్ రూపాంతరం చెందినట్లు కోల్కతాలోని జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించింది. వైద్యశాఖలో ఇప్పటి వరకు సుమారు 30 మంది కొవిడ్-19 బారిన పడ్డారు. ఉస్మానియా వైద్యకళాశాల పరిధిలో 15 మంది, నిమ్స్లో నలుగురు వైద్యులతోపాటు ముగ్గురు ల్యాబ్ సిబ్బందికి, కింగ్కోఠి దవాఖానలో ఆరుగురికి వైరస్ సోకింది. అప్రమత్తమైన ప్రభుత్వం గాంధీ దవాఖానలో అదనంగా 350 పడకలు ఏర్పాటు చేస్తున్నది.కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో పాటు వైద్య సిబ్బంది సైతం వైరస్ బారిన పడుతుండడం కలవరానికి గురిచేస్తున్నది. మరో పక్క వైరస్ దశలు మారుతున్నట్లు వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 55రకాలుగా వైరస్ రూపాంతరం చెందినట్లు కోల్కతాలోని (జెడ్ఎస్ఐ)జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించింది. వైద్యశాఖలో ఇప్పటి వరకు సుమారు 30మంది వైద్యసిబ్బందికి, పోలీసు శాఖలో 65మందికి వైరస్ సోకినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈనెల 2న ఉస్మానియా వైద్యకళాశాల పరిధిలో 15మంది వైద్యవిద్యార్థులకు, నిమ్స్లో నలుగురు వైద్యులతో పాటు ముగ్గురు క్యాథ్ల్యాబ్ సిబ్బందికి, కింగ్ కోఠి దవాఖానలో ఆరుగురు సిబ్బందికి, పలువురు జర్నలిస్టులకు వైరస్ సోకింది. అయితే వైద్యసిబ్బందికి వరుసగా ఇంత పెద్ద సంఖ్యలో వైరస్ సోకడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గత కొన్ని రోజులుగా గ్రేటర్లో కేసుల సంఖ్య రెండంకెల్లోనే కొనసాగుతూ తాజాగా బుధవారం మూడంకెలు దాటడం వైరస్ తీవ్రతకు అద్దం పడుతున్నది. వైరస్ రూపాంతరాలు చెంది రకరకాలుగా మ్యుటేట్ అవుతుందని వైద్యులు భావిస్తున్నారు. ఈ క్రమంలో వైరస్ విజృంభిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమై అదనపు సౌకర్యాలను కల్పిస్తున్నది. ఇందులో భాగంగానే గాంధీ దవాఖానలో అదనంగా మరో 350 పడకలను పెంచుతూ వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం గాంధీలో 1500 పడకలు ఉన్నాయి. దీనికి అదనంగా దవాఖానలోని ఓపీ విభాగంలో 150 పకడలు, గాంధీ మెడికల్ కళాశాల పరిధిలో 200పడకలను ఏర్పాటు చేస్తున్నట్లు దవాఖాన సూపరింటెండెంట్ డా.రాజారావు తెలిపారు. దీంతో గాంధీలో మొత్తం కొవిడ్ పడకల సంఖ్య 1850కి చేరింది. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలోని గాంధీ, కింగ్కోఠి, ఎర్రగడ్డ ఛాతి దవాఖానలు కొవిడ్ దవాఖానలుగా కొనసాగుతున్నాయి. ఇక్కడ మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి అధికారులను ఆదేశించారు. వీటికి తోడు మరో 1500పడకల సామర్థ్యంతో గచ్చిబౌలిలో టిమ్స్ దవాఖానను సైతం అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కేసులు ఎన్ని పెరిగినా పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ సిద్ధంగా ఉన్నట్లు మంత్రి స్పష్టం చేశారు.