నేరేడు అంటే..
భారతదేశాన్ని అనాదిగా జంబూద్వీపం అని పిలుస్తారు. జంబు అంటే నేరేడు చెట్టు అని అర్థం. భారతదేశం నేరేడు చెట్లతో నిండి ఉన్న ప్రదేశంలో సమృద్ధికరమైన భూగర్భజలాలు నిండి ఉంటాయని దీని వల్ల పాడి పంటలు సస్యశ్యామలంగా వెల్లివిరుస్తాయని అర్థం. అందుకే సగర్వంగా ‘జంబూద్వీపే భరతఖండే’ అని మన మంత్రాల్లో చదువుతారు. నేరేడులోని అంగాంగాలు అన్నీ ఔషధాలుగా మనకు ఉపయోగపడతాయి. సంస్కృతంలో జంబు, సురభి పత్ర అని, హిందీలో జామూన్ అని, తెలుగులో కాకినేరేడు, అల్లనేరేడు అని, ఇంగ్ల్లిష్లో జంబుల్ ద బ్లాక్ ప్లమ్ అని పిలుస్తారు. అల్లనేరేడు కన్నా కాకి నేరేడు ఉన్నతమైంది. ఇది వగరు, పులుపు రుచులు కలిగి తీపిగా మారుతుంది. విశేషంగా మధుమేహ రోగాలను, శ్లేష్మ, పైత్య రోగాలు, హృదయరోగాలను హరింపజేసి శారీరక పుష్టిని కలిగిస్తుంది.
పోషకాలు (వందగ్రాముల్లో)
తేమ: 83.7గ్రా, పిండి పదార్థం: 19 గ్రా, మాంసకృత్తులు: 1.3గ్రా, కొవ్వు: 0.1గ్రా, ఖనిజాలు: 0.4గ్రా, పీచుపదార్థం: 0.9గ్రా, క్యాల్షియం: 15-30మి.గ్రా, ఇనుము: 0.4మి.గ్రా-1మి.గ్రా, సల్ఫర్: 13మి.గ్రా, విటమిన్ సి: 18మి.గ్రా.
నేరేడుతో రోగాలు దూరం
- నేరేడు గింజల్ని దోరగా వేయించి దంచి పొడి చేసుకుని నిల్వ ఉంచుకోవాలి. ఈ పొడిని నీటిలో కలిపి కషాయం కాచి, అందులో పాలు, తాటి కలకండ కలిపి కాఫీలాగా రెండు పూటలా తాగితే అతి మూత్రం, మధుమేహం అదుపులోకి వస్తాయి.
- సీజనల్లో అల్ల నేరేడు పండ్లను రోజుకు కనీసం 10 తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. శుభకార్యాల్లో అల్లనేరేడు ఆకులను కడితే సూక్ష్మక్రిములు దరిచేరవు.
- కాలేయానికి మేలే చేస్తుంది. ఎండకాలంలో దప్పిక అరికడుతుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఈ పండ్లు నివారిస్తాయి. కడుపులోకి ప్రమాదవశాత్తు చేరిన తల వెంట్రుకలు, లోహపు ముక్కలను సైతం కరిగిస్తాయి.
- చిగుళ్ల వ్యాధులతో బాధపడేవారు ఈ చెట్టు బెరడు ఆకుల రసాన్ని నోట్లో వేసుకుని పుక్కిలిస్తే చాలా మంచిది. పుల్లలతో పళ్లు తోమితే చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. నోటి దుర్వాసనను నివారిస్తుంది. చెట్టు ఆకులు ఎండబెట్టి చూర్ణంలో కొంచెం ఉప్పు కలిపి పళ్లు తోముకుంటే గట్టి పడతాయి.
- కడుపులో నులి పురుగులను నివారిస్తుంది. మూత్రాశయ, నోటి, క్యాన్సర్కు టానిక్లా పనిచేస్తుంది. చెట్టు ఆకులను గాయంపై కట్టవచ్చు. విటమిన్ ఏ, సీ అధికంగా లభిస్తుంది. శరీరంపై కాలిన గాయాలుంటే తర్వాత మచ్చలు ఏర్పడకుండా నివారిస్తుంది.
- నీళ్ల, రక్త విరేచనాలకు నేరేడు కషాయం..
- నేరేడు 50 గ్రాములు దంచి లీటరు నీటిలో వేయాలి. అందులో 10 గ్రాములు యాలకుల పొడి, 10 గ్రాములు దాల్చిన చెక్క పొడి కలిపి అరలీటరు కషాయం మిగిలే వరకు మరిగించి వడకట్టి పూటకు అరగ్లాసు మోతాదుగా మూడు పూటలు ఈ కషాయాన్ని తాగితే నీళ్ల విరేచనాలు తగ్గుతాయి. నేరేడు చెక్కతో కాచిన కషాయం అరకప్పు, అందులో అరకప్పు గోరువెచ్చని మేకపాలు కలిపి చల్లార్చి రెండు పూటలు తాగితే రక్తవిరేచనాలు అరికట్టవచ్చు.
నేరేడు పండు పానీయం..
బాగా పండిన నేరేడు పండ్లను పిసికి గింజలు తీసి వేసి ఆ గుజ్జును తూకం వేసి, సమానంగా పటిక బెల్లం దానిలో కలిపి కరిగించి చిన్న మంటపైన పాకం వచ్చే వరకు మరిగించి దించి నిలువ చేసుకోవాలి. రోజూ రెండు చెంచాలు మోతాదుగా ఈ పాకాన్ని అరగ్లాసు మంచినీటిలో కలిపితే తీయని రుచికరమైన పానీయంగా ఉంటుంది.దీన్ని తాగితే పొడిదగ్గు, రక్తక్షీణత గొంతు సమస్యలు నివారించవచ్చు.