92.2% పడకలు ఖాళీ

హైదరాబాద్‌, (ఆరోగ్యజ్యోతి): రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతున్నప్పటికీ.. రికవరీ రేటు కూడా అదేస్థాయిలో పెరుగుతూ వస్తున్నది. ఇప్పటివరకు 29,536 కేసులు నమోదు కాగా 17,279 మంది డిశ్చార్జి అయ్యారు. బుధవారం ఒక్కరోజే 1924 కేసులు పాజిటివ్‌ రాగా.. 992 మంది కరోనా నుంచి విముక్తి పొంది ఇండ్లకు వెళ్లిపోయారు. ఈ కారణంగానే కరోనా రోగుల కోసం ప్రభుత్వం ఏర్పాటుచేసిన పడకల్లో 92.2 శాతం ఖాళీగానే ఉంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 17 వేల పడకలను అందుబాటులోకి తీసుకురాగా.. అన్ని దవాఖానల్లో కలిపి దాదాపు 8 శాతం మాత్రమే నిండాయని బుధవారం వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. ఐసీయూల్లో కూడా 89 శాతం పడకలు ఖాళీగానే ఉన్నాయి. గాంధీ దవాఖానలో సైతం 1,141 పడకలు ఖాళీగా ఉన్నాయి.