-తొర్రూరు ఎంపీపీ అంజయ్య
తొర్రూరు(ఆరోగ్యజ్యోతి): సమాజ సేవ చేయడం ఉత్తమ లక్షణం అని ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య అన్నారు. గురువారం డివిజన్ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ధర్మశ్రీ ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు ధరావత్ విమల ఆధ్వర్యంలో పదవీ విరమణ పొందిన ట్రాఫిక్ ఎస్ఐ బి. స్వామిదాస్, ప్రముఖ గాయకులు యాసారపు రాంబాబు లను ఘనంగా సత్కరించారు.ఉత్తమ సేవలకు గాను ఎస్సై స్వామి దాస్ ను, "పాటమ్మ తోనే ప్రాణం నాకు" పాటతో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన రాంబాబును శాలువా, పూలమాలతో సత్కరించి జ్ఞాపిక బహుకరించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ సంపాదనే పరమార్థం కాకుండా ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకునేందుకు ప్రతి వ్యక్తి కృషి చేయాలన్నారు. కొందరు మహానుభావులు చనిపోయినా ప్రజల గుండెల్లో ఎప్పుడూ బతికే ఉంటారని గుర్తు చేశారు. ధర్మశ్రీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు స్పూర్తి దాయకమన్నారు. ధర్మశ్రీ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు విమల మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో స్వామిదాస్ బాధ్యతగా విధులు నిర్వహించారని గుర్తు చేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన రాంబాబు ఒక్క పాటతో ప్రపంచానికి పరిచయమయ్యాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు విశ్వనాధ్, ప్రతినిధులు ధరావత్ శంకర్ , కార్తీక్ , క్రాంతి, శశిరేఖ , లక్ష్మీ, యశోద స్వరూపలు పాల్గొన్నారు.