
డా.ప్రతాప్ సి.రెడ్డి
ఫిలింనగర్,(ఆరోగ్యజ్యోతి): దక్షిణాసియా, మధ్య ప్రాచ్యదేశాల్లో తొలిగా చెన్నైలో ప్రారంభించిన అపోలో ప్రోటాన్ క్యాన్సర్ సెంటర్ (ఏపీసీసీ)కు జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల్ (జేసీఐ) గుర్తింపు లభించింది. ఆన్లైన్ వేదికగా శుక్రవారం నిర్వహించిన సమావేశంలో అపోలో గ్రూప్ ఆసుపత్రుల ఛైర్మన్ డా.ప్రతాప్ సి.రెడ్డి వివరాలు వెల్లడించారు. దేశంలో అడ్వాన్స్డ్ క్యాన్సర్ చికిత్సకు ప్రత్యేకంగా తీసుకొచ్చిన అపోలో ప్రోటాన్ క్యాన్సర్ సెంటర్ అంతర్జాతీయంగా గుర్తింపు సాధించిన మొట్టమొదటి కేంద్రమన్నారు. పాతికేళ్ల క్రితం దేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగించిందన్నారు. ఈ క్రమంలో ఆంకాలజీ కేంద్రాల కొరత ఉండటంతో అపోలో నుంచి ఏపీసీసీని నెలకొల్పామన్నారు. జేసీఐ అక్రిడిటేషన్ ఆసుపత్రుల పనితీరుకు ఓ మైలురాయి అని తెలిపారు. ఆసుపత్రుల వైస్ ఛైర్పర్సన్ ప్రీతారెడ్డి మాట్లాడుతూ ప్రోటాన్ థెరపీని ఏడాది క్రితం చెన్నైలోని అపోలో ప్రోటాన్ క్యాన్సర్ సెంటర్లో ప్రవేశపెట్టామన్నారు.