గాంధీల స్వచ్ఛందసంస్థలపై దర్యాప్తు

 





  • కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం

  • రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌, రాజీవ్‌గాంధీ చారిటబుల్‌ ట్రస్ట్‌, ఇందిరాగాంధీ మెమోరియల్‌ ట్రస్ట్‌పై విచారణ 

  • అక్రమ విరాళాలు,  పన్ను ఎగవేత ఆరోపణలు


న్యూఢిల్లీ: ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌ రథసారధులు గాంధీల ఆధ్వర్యంలో నడుస్తున్న మూడు స్వచ్ఛంద సంస్థల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని పేర్కొంటూ వాటిపై దర్యాప్తును సమన్వయం చేసేందుకు కేంద్రప్రభుత్వం అంతర మంత్రిత్వశాఖ కమిటీని ఏర్పాటుచేసింది. సోనియా గాంధీ కుటుం బం ఆధీనంలోని రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌, రాజీవ్‌గాంధీ చారిటబుల్‌ ట్రస్ట్‌, ఇందిరాగాంధీ మెమోరియల్‌ ట్రస్ట్‌లపై మనీలాండరింగ్‌, పన్ను ఎగవేత చట్టాల ఉల్లంఘన ఆరోపణలు ఉన్నాయని కేంద్రహోంశాఖ బు ధవారం ప్రకటించింది. ఈ సంస్థలపై దర్యాప్తును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ప్రత్యేక డైరెక్టర్‌ నేతృత్వంలో అంతర మంత్రిత్వ కమిటీ పర్యవేక్షిస్తుందని ట్వీట్‌ చేసింది.


ట్రస్టులపై కేంద్రం తీవ్ర ఆరోపణలు


మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జ్ఞాపకార్థం ఆయన కుటుంబం 1991లో రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌ (ఆర్జీఎఫ్‌)ను ఏర్పాటుచేసింది. 2002లో రాజీవ్‌గాంధీ చారిటబుల్‌ ట్రస్ట్‌ (ఆర్సీటీ)ను నెలకొల్పింది. ఇందిరాగాంధీ మెమోరియల్‌ ట్రస్ట్‌ను 2001లో ఏర్పాటుచేశారు. ఆర్జీఎఫ్‌, ఆర్సీటీకు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీయే చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఈ సంస్థలు హవాలా మార్గంలో విదేశాల నుంచి నిధులు సేకరించాయని కేంద్ర ప్రభుత్వం కొంతకాలంగా ఆరోపిస్తున్నది. అంతేకాకుండా ఈ సంస్థలు ఆదాయపన్ను చట్టం, విదేశీ విరాళాల నియంత్రణ చట్టాలను ఉల్లంఘించి నేరపూరిత చర్యలకు పాల్పడ్డాయంటూ కేంద్రం దర్యాప్తునకు ఆదేశించింది.


ప్రపంచమంతా తనలాగే ఉందని మోదీ భావిస్తున్నారు: రాహుల్‌


కేంద్రప్రభుత్వ చర్యపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ తీవ్రంగా స్పందించింది.‘ప్రపంచం మొత్తం తనలాగే ఉందని ప్రధాని మోదీ అనుకుంటున్నారు. కానీ నిజాలు నిర్భయంగా చెప్పేవాళ్లకు వెలకట్టలేమని ఆయన తెలుసుకోలేకపోతున్నారు’ అని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ అన్నారు.