ప్రైవేటు వైద్యకాలేజీల్లో కొవిడ్‌ చికిత్స


  • అందుబాటులోకి 10 వేలకు పైగా బెడ్లు

  • అక్కడ కూడా ఉచితంగానే చికిత్స

  • ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి ఈటల 


హైదరాబాద్‌, (ఆరోగ్యజ్యోతి): ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోనూ కొవిడ్‌ చికిత్స అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఏర్పాట్లను వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ బుధవారం స్వయంగా పరిశీలించారు. ఇందులో భాగంగా ఎల్బీ నగర్‌లోని కామినేని, సంతోష్‌నగర్‌లోని ఒవైసీ హాస్పిటల్‌ను పరిశీలించారు. కరోనా పేషెంట్లకు చికిత్స అందించేందుకు త్వరితగతిన అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గురువారం నాచారం ఈఎస్‌ఐ దవాఖాన, మల్లారెడ్డి మెడికల్‌ కాలేజీ, మమత మెడికల్‌ కాలేజీలను పరిశీలిస్తారు. కొవిడ్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో ఉచితంగా చికిత్స అందించాలని ప్రభుత్వం ఏర్పాట్లుచేస్తున్నది. తాజా నిర్ణయంతో కొత్తగా 10 వేలకు పైగా పడకలు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 21 మెడికల్‌ కాలేజీల్లో 15,000 బెడ్లు అందుబాటులో ఉన్నప్పటికీ తొలిదశలో భాగంగా 10 వేలకు పై చిలుకు బెడ్లు సిద్ధమవుతున్నాయి. హైదరాబాద్‌ పరిసరాల్లోనే దాదాపు 10 వరకు మెడికల్‌ కాలేజీలు ఉండగా, కరీంనగర్‌, మెదక్‌, సిద్దిపేట, మహబూబ్‌నగర్‌, ఖమ్మం, నల్లగొండ తదితర జిల్లాల్లో ఉన్నాయి. ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారం భవిష్యత్‌లో అన్ని ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో నిర్ధారణ పరీక్షలు జరిపేందుకు ప్రభుత్వం యోచిస్తున్నదని కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ వీసీ డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డి నమస్తే తెలంగాణకు తెలిపారు.