- అతిసారం, గొంతుమంట, అలసట
- చైనాలో బుబోనిక్ ప్లేగ్ వ్యాధి
న్యూఢిల్లీ(ఆరోగ్యజ్యోతి): కరోనా వైరస్ లక్షణాల్లో కేంద్రం తాజాగా ప్రకటించిన కొత్త లక్షణాలు వైద్యుల్లో గందరగోళం సృష్టిస్తున్నాయి. ఏది కరోనానో ఏది సాధారణ వ్యాధో తేల్చలేక తికమక పడుతున్నారు. కేంద్రం ఇటీవల అతిసారం, గొంతులో మంట, అలసటను కరోనా కొత్త లక్షణాలుగా ప్రకటించింది. అయితే, సాధారణంగా వర్షాకాలంలో వచ్చే వ్యాధుల లక్షణాలు కూడా ఇలాగే ఉండటంతో బాధితులకు కరోనా పరీక్షలు చేయాలా వద్దా అనే అంశంపై వైద్యులు ఎటూ తేల్చలేకపోతున్నారు. బాధితులు పట్టుబడుతుండటంతో పరీక్షలు చేయక తప్పటంలేదని హైదరాబాద్లోని ఛాతీ, కింగ్ కోఠి దవాఖాన వైద్యులు చెప్తున్నారు. దీంతో నిజమైన కరోనా రోగులకు చికిత్స ప్రక్రియ ఆలస్యమవుతున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీజనల్ వ్యాధులతో కూడా అతిసారం ప్రబలుతుందని, ఫుడ్ పాయిజన్ కారణంగా వాంతులు చేసుకుంటారని చెప్తున్నారు.
మారుతున్న కరోనా
కొవిడ్- 19 కాలంతోపాటు జన్యుక్రమాన్ని మార్చుకుంటున్నదని వైద్యులు అంటున్నారు. అందువల్లనే వేసవికాలంలో కనిపించని లక్షణాలు వర్షాకాలం రాగానే బయటపడుతున్నాయని చెప్తున్నారు. చైనాలో కరోనా బయటపడిన కొత్తలో రోగిలో దగ్గు, జ్వరం, జలుబు వంటి కొన్ని లక్షణాలు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 20 లక్షణాలకుపైగా గుర్తించారు. వర్షాకాలంలో సహజంగా వర్చే డయేరియాతో రోగిలో వాంతులు, విరేచనాలు, బీపీ, షుగర్ స్థాయిలు పడిపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కరోనా రోగుల్లో కూడా ఇవే లక్షణాలు గుర్తించటంతో వైద్యులు తలలుపట్టుకుంటున్నారు.