కరోనా విజేతలు 15.35లక్షల మంది


వైరస్‌ నుంచి కోలుకున్న వారి సంఖ్య ఇది
ఇప్పటివరకు 22.15 లక్షల మందికి కొవిడ్‌-19


 దిల్లీ: మన దేశంలో కొవిడ్‌-19 వైరస్‌ రోజురోజుకూ విస్తరిస్తున్నప్పటికీ ఆ మహమ్మారిపై విజయం సాధిస్తున్న వారి సంఖ్యా గణనీయంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 22.15 లక్షల మందికి పైగా వైరస్‌ సోకగా వారిలో 15.35లక్షల మందికిపైగా  కోలుకున్నారు. పరీక్షల సంఖ్య పెంచటం, సమర్థవంతమైన చికిత్సల వల్ల వ్యాధి నుంచి క్షేమంగా బయటపడుతున్న వారి సంఖ్య పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.


ఒక్క రోజులో వెయ్యి మరణాలు
ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు గడచిన 24 గంటల్లో 62,064 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 60 వేలకు పైగా కేసులు నమోదు కావటం వరుసగా ఇది నాలుగో రోజు. 24 గంటల్లో వెయ్యి మందికి పైగా మరణించారు. మహారాష్ట్రలో 390, తమిళనాడులో 119, కర్ణాటకలో 107 మంది చనిపోయారు. మహారాష్ట్రలో 260 పెండింగ్‌ మరణాలను జత చేయడంతో ఆ రాష్ట్రంలో మృతుల సంఖ్య భారీగా పెరిగినట్లు కనిపించింది. మరో వైపు ఒకే రోజు గరిష్ఠంగా 54,859 మంది కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 69.33%కి చేరింది.



మరణాల నిష్పత్తి తగ్గుదల
దేశంలో కరోనా వల్ల చనిపోతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నప్పటికీ మొత్తం పాజిటివ్‌ కేసుల్లో మృతుల నిష్పత్తి తగ్గుతోంది. సోమవారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన లెక్కల ప్రకారం దేశంలో మరణాల రేటు 2%కి చేరింది. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 44,386 మంది మరణించారు. ఈ విషయంలో భారత్‌ ప్రపంచంలో అయిదో స్థానంలో నిలిచింది. అయితే, మరణాల రేటు ప్రపంచ స్థాయి 3.7% కన్నా తక్కువలో ఉంది.
* ప్రస్తుతం పాజిటివ్‌ కేసుల సంఖ్య పరంగా ప్రపంచంలో మూడో స్థానంలో ఉన్న మన దేశం రోజువారీ కేసుల వృద్ధిలో కొన్ని రోజులుగా అన్నింటి కంటే మించి ఉంటోంది.
* భారత్‌లో ఇప్పటి వరకు 2.45 కోట్ల పరీక్షలు పూర్తయ్యాయి. ఈ విషయంలో చైనా (9 కోట్లు), అమెరికా (6.5 కోట్లు), రష్యా (3 కోట్లు) భారత్‌ కంటే ముందున్నాయి.