● 6 నెలల కిందటే జీహెచ్ఎంసీ విజిలెన్సు విభాగం గుర్తింపు
● ఇప్పటి వరకు ఒక్కదానిపైనా చర్యల్లేవు
హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి) : రాజధానిలో పుట్టగొడుగుల్లా ప్రైవేటు ఆస్పత్రులు వెలిశాయి.. వెలుస్తున్నాయి. చాలా వాటికి ఒకటుంటే ఒక అనుమతి ఉండడంలేదు. కీలకమైన అగ్నిమాపక శాఖ అనుమతి తీసుకోవడంలేదు. పెద్ద ప్రైవేటు ఆస్పత్రుల్లో వెయ్యి వరకు, చిన్నవాటిల్లో 100-500 వరకు పడకలుంటున్నాయి. అగ్నినిరోధక వ్యవస్థ లేకపోతే ప్రమాదాలు జరిగినప్పుడు పెద్దఎత్తున ప్రాణనష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. ఆసుపత్రుల్లో గతంలో ప్రమాదాలు జరిగినప్పుడు దీనిపై పెద్దఎత్తున విమర్శలు రేగడంతో ప్రభుత్వ అనుమతితో బల్దియా విజిలెన్సు, ఎన్ఫోర్సుమెంట్ విభాగం ఏడాది కిందట రంగంలోకి దిగింది. మహానగరంలోని 2400 ఆస్పత్రులకు నోటీసులు ఇచ్చింది. విజిలెన్సు విభాగం క్షేత్రస్థాయిలో పరిశీలించగా 400 వైద్యశాలలు అప్పటికే మూతపడినట్లుగా గుర్తించింది. మిగిలిన 1900 వైద్యశాలల్లో మూడు రకాల ఉల్లంఘనల తనిఖీలు చేపట్టింది. దాదాపు 1500 ఆస్పత్రులు అగ్నిమాపక శాఖ ఎన్ఓసీ లేకుండానే నడుస్తున్నాయని తేలింది. వీటిల్లో ప్రమాదం జరిగితే పెద్దఎత్తున ప్రాణనష్టం వాటిల్లే అవకాశం ఉందని గుర్తించింది.
ఎందుకంత నిస్తేజం!
1500 ఆస్పత్రులు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని గుర్తించినా బల్దియా విజిలెన్సు విభాగం చర్యలు తీసుకోవడానికి వెనుకాడింది. ఒక్కసారిగా అన్నింటిపై చర్యలు చేపడితే వైద్య సేవలకు ఇబ్బందులొస్తాయని భావించి కాలం వెళ్లబుచ్చింది. బల్దియా కమిషనర్కు నివేదిక పంపినా చర్యలకు ఆదేశాలు రాలేదు. అన్ని వైద్యశాలలను అప్పటికప్పుడు మూసివేయకపోయినా కనీసం అగ్నినిరోధక వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఒత్తిడి తెస్తే ఫలితం ఉండేది. అదీ చేయకపోవడంతో కనీస జాగ్రత్తలు లేకుండా ఆస్పత్రులు నడుస్తున్నాయి. కరోనా కేసులు పెరగడంతో కొన్ని ంటిలో అదనపు పడకలను వేసి వైద్యం అందిస్తున్నాయి. అగ్నిప్రమాదం జరిగితే అగ్ని మాపక శకటం లోపలికి వెళ్లడానికీ వీల్లేని పరిస్థితి ఉంది. రోగులు క్షేమంగా బయటపడే దారులూ లేకపోవడం గమనార్హం. విజయవాడలో కొవిడ్ చికిత్సకు తీసుకున్న హోటల్లో అగ్నిప్రమాదం నేపథ్యంలో అన్ని ఆసుపత్రులు, తాత్కాలిక కొవిడ్ చికిత్స కేంద్రాల్లో తనిఖీలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికైనా ఎన్వోసీ లేని ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
భాగ్యనగరంలో 1500 ఆస్పత్రులు అగ్నిమాపక శాఖ అనుమతి లేకుండానే నడుస్తున్నాయంటే మీరు నమ్ముతారా? అవును.. ఇది వాస్తవం. జీహెచ్ఎంసీ విజిలెన్సు ఎన్ఫోర్సుమెంట్ విభాగం ఇదే చెబుతోంది. మరో వాస్తవం ఏంటంటే ఆరు నెలల కిందటే ఈ విషయాన్ని ఆ విభాగం గుర్తించింది. ఆయా వైద్యశాలలన్నీ అగ్నిమాపక శాఖ నిరభ్యంతర పత్రం(ఎన్ఓసీ) లేకుండానే నడుస్తున్నాయని స్పష్టం చేసింది. ఇంతవరకు ఒక్కటంటే ఒక్క ఆస్పత్రిపైనా బల్దియా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
పరిశీలించిన మూడు అంశాలు
1. అగ్నిమాపక శాఖ శకటం వెళ్లడానికి సెట్బాక్ ఉందా..
2. భవనానికి అగ్ని నిరోధక వ్యవస్థ పక్కాగా ఉందా..
3. అగ్నిప్రమాదం జరిగితే రోగులను బయటకు తెచ్చేందుకు సరైన దారులున్నాయా
ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా చర్యలు
విశ్వజిత్ కంపాటి, బల్దియా విజిలెన్స్ డైరెక్టర్
ఆరు నెలల కిందట 2400 ఆస్పత్రులకు తాఖీదులిచ్చాం. వాటిల్లో 80 శాతానికిపైగా అగ్నిమాపక శాఖ ఎన్ఓసీ తీసుకోలేదని తేలింది. ప్రస్తుతం అన్నీ కరోనా బాధితులతో నిండి ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం.