హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి):మరో 25 బస్తీ దవాఖానలను శుక్రవారం ప్రారంభిస్తున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నాలుగు చోట్ల మంత్రి కేటీఆర్, నాలుగు చోట్ల హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, రెండు చోట్ల డిప్యూటీ స్పీకర్ పద్మారావు, రెండు చోట్ల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, రెండు చోట్ల విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మూడు చోట్ల మేయర్ బొంతు రామ్మోహన్, శాసన మండలి ప్రభుత్వ విప్ ఎంఎస్.ప్రభాకర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డిప్యూటీ మేయర్ మరో మూడు చోట్ల బస్తీ దవాఖానలను ప్రారంభిస్తారని వెల్లడించారు. దీంతో జీహెచ్ఎంసీలో దవాఖానల సంఖ్య 195కు చేరుతుందని వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 300 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, ప్రజల అవసరాలను బట్టి రానున్న రోజుల్లో మరిన్ని బస్తీ దవాఖానల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఉచిత వైద్య పరీక్షలు, మందులు అందిస్తున్న బస్తీ దవాఖానలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు.