అమ్మో క్యాన్సర్‌.....క్యాన్సర్‌!


  • దేశంలో ఈ ఏడాది చివరికి 13.9 లక్షల కేసులు 

  • 2025నాటికి 15.7 లక్షలకు పెరుగుదల 

  • పురుషుల కన్నా మహిళల్లో అధికం 

  • తాజా అధ్యయనంలో వెల్లడి 


న్యూఢిల్లీ, (ఆరోగ్యజ్యోతి):  దేశంలో ఈ ఏడాది చివరి నాటికి క్యాన్సర్‌ బాధితుల సంఖ్య 13.9 లక్షలకు చేరే ప్రమాదం ఉన్నదని, 2025 నాటికి ఈ సంఖ్య 15.7 లక్షలకు పెరుగవచ్చని ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌), ‘నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ ఇన్ఫర్మెటిక్స్‌ అండ్‌ రిసెర్చ్‌' ఈ మేరకు నివేదికను విడుదల చేశాయి. దీని ప్రకారం.. 



  • ఈ ఏడాది చివరికి పురుషుల్లో క్యాన్సర్‌ కేసులు 6,79,421కి చేరవచ్చు. 2025 నాటికి 7,63,573కి పెరుగవచ్చు. పురుషుల్లో ఊపిరితిత్తులు, నోరు, ఉదర క్యాన్సర్‌ అధికం.

  • పొగాకు సంబంధిత క్యాన్సర్‌ కేసులు ఈ ఏడాది చివరికి 3.7 లక్షలకు చేరనున్నాయి. మొత్తం కేసుల్లో ఇవి 27.1%. పొగాకు సంబంధిత క్యాన్సర్‌ ఈశాన్య రాష్ర్టాల్లో ఎక్కువ.

  • మహిళల్లో ఈ ఏడాది ఆఖరుకు క్యాన్సర్‌ కేసులు 7,12,758కి చేరవచ్చు. 2025 నాటికి 8,06,218 కేసులు నమోదు కావొచ్చు. మహిళల్లో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్‌ అధికం.

  • 2025 నాటికి 2,38,908 కేసులతో రొమ్ము క్యాన్సర్‌ ఎక్కువ మందిలో కనిపించనుంది. ఆ తర్వాతి స్థానాల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్‌, నోటి క్యాన్సర్‌  ఉండనున్నాయి.

  • ప్రతి లక్ష జనాభాకు అత్యధిక క్యాన్సర్‌ కేసులు ఐజ్వాల్‌ (మిజోరం) జిల్లాలో నమోదవుతుండగా, అతి తక్కువగా ఉస్మానాబాద్‌, బీడ్‌లో నమోదుతున్నాయి.