కరోనా విషయంలో గాఢనిద్రలో తెలంగాణ సర్కారు
భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా విమర్శలు
దిల్లీ: తెలంగాణలో కరోనా బాధితులకు ఐసీయూలో బెడ్కు రోజుకు రూ.లక్ష ఖర్చవుతోందంటే ప్రజలెంతగా ఇబ్బంది పడుతున్నారో తెలుస్తోందని భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా విమర్శించారు.అనంతరం నడ్డా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం గాఢనిద్రలో ఉందని, కరోనా పరీక్షలకు సరైన సౌకర్యాలు లేవని ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా ఇక్కడే అతి తక్కువ పరీక్షలు చేయడం గర్హనీయమన్నారు. ఆక్సిజన్ అందించలేకపోవడంతో ఒక విలేకరి మరణించారనే విషయం కలిచివేసిందన్నారు. కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు నిందించిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలుచేస్తే తెలంగాణలో 98 లక్షల మందికి రూ.5లక్షల మేర ఉచితవైద్యం లభించేదన్నారు. చేసిన వాగ్దానాలు ఎందుకు అమలుచేయడం లేదో కేసీఆర్ తెలపాలని డిమాండ్ చేశారు. రూ.45వేల కోట్లతో పూర్తవుతుందనుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం రూ.85వేల కోట్లకు పెరగడానికి అవినీతే కారణమని విమర్శించారు. లక్ష ఉద్యోగాలు, ఉపాధి కల్పన హామీలు ఆరేళ్లయినా నెరవేరలేదన్నారు. కరోనాపై పోరులో ప్రధాని మోదీ ప్రపంచానికి మార్గం చూపుతున్నారని, సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు రూ.20లక్షల కోట్ల ఆత్మనిర్భర్ ప్యాకేజీ ప్రకటించారని నడ్డా గుర్తుచేశారు. తద్వారా వివిధ రంగాలకు కేటాయింపులు, కలిగే ప్రయోజనాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. తెలంగాణ ప్రజలు మోదీ తరహా పాలన కావాలని కోరుకుంటున్నందున.. వచ్చే శాసనసభ ఎన్నికల్లో తెరాసను గద్దె దించి భాజపాను అధికారంలోకి తేవాలని కార్యకర్తలకు నడ్డా పిలుపునిచ్చారు.భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. బెంగాల్, కేరళల మాదిరే తెరాస ప్రభుత్వం భాజపా కార్యకర్తలపై దమనకాండ కొనసాగిస్తోందన్నారు. తెరాస కార్యాలయం కల్వకుంట్ల ఆస్తిగా మిగిలితే, ఎంఐఎం, కమ్యూనిస్టు కార్యాలయాలు సంఘవిద్రోహ శక్తులకు అడ్డాలుగా మారాయని విమర్శించారు. భాజపా కార్యకర్తల పోరాటంతోనే రామజన్మభూమి కల నెరవేరిందన్నారు. రాష్ట్రంలో తెరాసను ఓడించి భాజపా అధికారంలోకి వస్తుందన్నారు. కేంద్ర కార్యాలయం నుంచి భాజపా ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు కార్యక్రమంలో పాల్గొని నడ్డా హిందీ ప్రసంగాన్ని తెలుగులో అనువాదం చేశారు. రాష్ట్ర కార్యాలయంలో మాజీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు.