కదిరి(ఆరోగ్యజ్యోతి): కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త నిరసనలో భాగంగా ఈరోజు కదిరి టౌన్ లో వాసవి నగర్, పార్క్ స్కూల్ సచివాలయం వద్ద సిపిఎం నిరసన చేపట్టింది. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి జి.ఎల్.నరసింహులు, పట్టణ కమిటీ సభ్యులు శాంతిభాయి, జగన్మోహన్, రామ్మోహన్, సాంబశివ, క్రిష్ణ నాయక్, సుధాకర్, విద్యార్థి నాయకులు బాబ్జాన్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కరోనా మహమ్మారితో దేశ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రజల ప్రాణాలని గాలికి వదిలేసి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టిందన్నారు. ఇప్పటికే రైల్వే ను ప్రైవేటుపరం చేసిందన్నారు. అదేవిధంగా బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, రక్షణ రంగం, టెలికమ్యూనికేషన్స్ ఇలాంటి కీలక రంగాలను ప్రైవేటీకరణ చేయడానికి పూనుకుందన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు పనులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఆదాయ పన్ను పరిధిలో లేని ప్రతి కుటుంబానికి 7500 రూపాయలు ఆర్థిక సహాయం, ప్రతి వ్యక్తికి పది కేజీల బియ్యంతో పాటు నిత్యవసర సరుకులు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పట్టణ ప్రాంతాలకు కూడా వర్తింపజేసి పనులు కల్పించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఎం చేపడుతున్న పోరాటాలలో ప్రజలు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.