- పెరిగిన టెస్టులు.. తగ్గిన పాజిటివ్లు
- గత వారంలో రికార్డుస్థాయి తగ్గుదల
- ప్రభుత్వం పకడ్బందీ చర్యలు
- ఇప్పటికే 1,500 పైగా కంటైన్మెంట్ జోన్లు
- 1,100 పైగా కరోనా నిర్ధారణ కేంద్రాలు
- రోజూ 40వేల పరీక్షలకు ఏర్పాట్లు
హైదరాబాద్, (ఆరోగ్యజ్యోతి) : రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 7.53 లక్షల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 92,255 మందికి పాజిటివ్ అని తేలింది. అంటే రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 12 శాతంగా ఉన్నది. గడిచినవారంలో ఇది 10 శాతంగా ఉంటే, శనివారంనాటికి ఇది 8 శాతానికి తగ్గింది. మొదట్లో హైదరాబాద్ నగరంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నది. ఆ తర్వాత వివిధ జిల్లాల్లో విజృంభించింది. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన వారంలో జిల్లాల్లోనూ కేసుల సంఖ్య తక్కువగా ఉన్నట్టు గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. జూలైలో ద్వితీయ శ్రేణి జిల్లాల్లో 100 దాకా కేసులు నమోదు కాగా, ఇప్పుడు వాటి సంఖ్య రెండు పదులకు తగ్గింది. ఆగస్టు 5వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 2,092 కరోనా కేసులు నమోదు కాగా, ఇందులో 535 జీహెచ్ఎంసీ పరిధిలోనివే. రంగారెడ్డి జిల్లాలో 169, వరంగల్ అర్బన్లో 128, మేడ్చల్ మల్కాజిగిరిలో 126, కరీంనగర్లో 123, సంగారెడ్డిలో 101 కేసులు నమోదయ్యాయి. అయితే ప్రస్తుతం కేసులు గణనీయంగా తగ్గముఖం పట్టాయి.
రాష్ట్ర రాజధానిలో మంచి పరిణామం
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కేసుల సంఖ్యలో గణనీయ తగ్గుదల కనిపిస్తున్నది. జూలై 8న జీహెచ్ఎంసీలో 1,590 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కానీ ఆగస్టు తొలివారం నుంచి క్రమంగా తగ్గుతున్నాయి. ఆదివారం 147 కేసులు మాత్రమే వెలుగుచూశాయి. కేసులు క్రమంగా తగ్గుతుండటంతో కంటైన్మెంట్ జోన్ల సంఖ్యను కుదిస్తున్నారు. జూలై 30న మొత్తం 92 కంటైన్మెంట్ జోన్లు ఉండగా, ప్రస్తుతం హైదరాబాద్లో 64 జోన్లు మాత్రమే యాక్టివ్గా ఉన్నాయి. జీహెచ్ఎంసీలో కేసులు ఎక్కువవుతున్న ప్రాంతాల్లో జోన్లను పెంచారు. ఎల్బీనగర్, చార్మినార్, ఖైరతాబాద్ వంటి ప్రాంతాల్లో ఈ పెరుగుదల గమనించవచ్చు. ఒకప్పుడు వందల్లో నమోదైన కేసులు ప్రస్తుతం తగ్గుముఖం పడుతుండటంతో నగరవాసులు ఊపిరిపీల్చుకుంటున్నారు.
మూడు జిల్లాల్లో సున్నా కేసులు
జిల్లాల్లోనూ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతుండగా, కొన్ని జిల్లాల్లో సున్నా కేసులు నమోదవుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లిలో రెండురోజుల నుంచి ఎలాంటి ఒక్క కేసు కూడా రికార్డుకాకపోగా, నారాయణపేట, నిర్మల్ జిల్లాల్లోనూ ఆదివారం కొత్త కేసులు నమోదుకాలేదు. భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, కామారెడ్డి, ములుగు, మెదక్, రాజన్న సిరిసిల్ల, వనపర్తి, వికారాబాద్, యాద్రాది భువనగిరి జిల్లాల్లో పదిలోపే కేసులు నమోదయ్యాయి.
ప్రభుత్వ కట్టుదిట్టమైన చర్యలు
కరోనా వ్యాప్తి కట్టడికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాన్ని కంటైన్మెంట్ చేస్తున్నది. ఇతరులకు వ్యాప్తించకుండా జీహెచ్ఎంసీ, పోలీసులు, వైద్యారోగ్యశాఖ అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 64 కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటుచేసి పరిరక్షిస్తున్నది. ఇక మిగతా అన్ని జిల్లాల్లో మొత్తం 1,569 కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటుచేసి వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నది. పాజిటివ్ కేసుల నుంచి మరొకరికి వైరస్ వ్యాప్తి చెందకుం డా పటిష్ఠ చర్యలు తీసుకుంటుండటంతో కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నది.
పెద్దమొత్తంలో పరీక్షలు
రాష్ట్రంలో ప్రస్తుతం సగటున రోజు 20 వేల పరీక్షలు చేస్తున్నారు. ఈ సంఖ్యను రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లుచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1,100 ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్ సెంటర్లను ఏర్పాటుచేసింది. ప్రైమరీ హెల్త్ సెంటర్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, యూపీహెచ్సీ, ఏరియా, జిల్లా దవాఖానల్లో ఈ కేంద్రాలను ఏర్పాటుచేశారు. దీంతో ఇకపై ప్రతి రోజు 40 వేల టెస్టులు నిర్వహించడం సాధ్యమవుతుందని వైద్యారోగ్యశాఖ అధికారులు చెప్తున్నారు.
వారంలో కరోనా కేసుల్లో తగ్గుదల ఇలా..
జిల్లా : ఆగస్టు 10 :ఆగస్టు 16
జీహెచ్ఎంసీ :338: 147
మేడ్చల్ మల్కాజిగిరి: 119 :51
రంగారెడ్డి :147 :85
సంగారెడ్డి: 49: 29
కరీంనగర్ :121: 69
వరంగల్ అర్బన్: 95 :44
వరంగల్ రూరల్: 35: 09
జోగుళాంబ గద్వాల: 85: 21
భద్రాద్రి కొత్తగూడెం: 60: 09
నల్లగొండ : 54: 37
సిద్దిపేట: 64 :58
యాదాద్రి భువనగిరి: 24: 01
రాజన్న సిరిసిల్ల: 38: 02
కామారెడ్డి :71: 07
వికారాబాద్: 21: 01
ఆదిలాబాద్: 14: 10
జగిత్యాల :59: 31
జనగామ :71: 07
జయశంకర్ భూపాలపల్లి: 20 :0
ఖమ్మం :65: 44
కుమ్రంభీం ఆసిఫాబాద్: 17: 11
మహబూబ్నగర్ :58: 30
మహబూబాబాద్: 23: 31
మంచిర్యాల: 11: 17
మెదక్ :14: 08
ములుగు :23: 06
నాగర్కర్నూల్: 07: 15
నారాయణపేట: 13 :0
నిర్మల్ :12 :0
నిజామాబాద్ :42: 38
పెద్దపల్లి :66: 62
సూర్యాపేట :32: 12
వనపర్తి :28: 02