- 9,500 మందికిపైగా కరోనా రోగులకు పునర్జన్మ
- పేషెంట్లలో పసికందులు, గర్భిణులు, వృద్ధులు
- అవసరమున్న వారికి అక్కడే ప్లాస్మా థెరపీ
వైద్యోనారాయణ హరి అంటారు.. వైద్యుడు నారాయణుడితో సమానమని అర్థం. ఇది నిజం..ఇదే నిజం.. కరోనా కకావికలం చేస్తున్న వేళ మేమున్నామంటూ అభయహస్తాన్ని అందిస్తున్నారు గాంధీ దవాఖాన వైద్యులు. ఊపిరి ఆడని వారికి సైతం ఊపిరిలూదుతున్నారు. ప్రాణాలు నిలుపడమే లక్ష్యంగా అహరహం శ్రమిస్తున్నారు. కొవిడ్-19 సోకి ఈ దవాఖానలో చేరి కోలుకున్న వారిలో పసికందులు మొదలు పండుముదుసలి వరకు ఉండటం విశేషం.
హైదరాబాద్, (ఆరోగ్యజ్యోతి): కరోనా మహమ్మారితో ప్రజలు అవస్థలు పడుతున్న సమయంలో కొవిడ్ చికిత్సల కోసం గాంధీ దవాఖానను ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. నాటి నుంచి నేటి వరకు వైద్యులు, సిబ్బంది కరోనాపై అలుపెరుగక పోరాడుతున్నారు. రోగులను కాపాడేందుకు ప్రాణాలు సైతం అడ్డుగా వేస్తున్నారు. అప్పుడే పుట్టిన పసికందులు.. మరొకరికి ప్రాణం పోసే నిండు గర్భిణులు.. వందేండ్లకు చేరువైన వారూ కరోనాతో ఆందోళన చెందుతుంటే వైద్యంచేసి ప్రాణాలు నిలబెట్టారు.
సంజీవని గాంధీ దవాఖాన
కరోనా రోగుల పాలిట గాంధీ దవాఖాన సంజీవనిగా మారింది. మార్చి తొలివారంలో నగరంలో తొలి కేసు నమోదైంది. మందుల్లేని మహమ్మారికి ఎవరు చికిత్స చేయాలన్న ప్రశ్నకు గాంధీ దవాఖానే సమాధానమైంది. కొవిడ్-19 లక్షణాలతో వచ్చిన ప్రతి ఒక్కరి ప్రాణాన్ని కాపాడేందుకు వైద్యులు, సిబ్బంది చేస్తున్న కృషి ఫలిస్తున్నది. రెండువేల పడకల సామర్థ్యం ఉన్న గాంధీ దవాఖానలో సుమారు 3వేల మంది వైద్య సిబ్బంది ద్వారా విడుతల వారీగా సేవలందుతున్నాయి. ఒక్కొక్కరు 6 నుంచి 8 గంటల పాటు పీపీఈ కిట్లు, మాస్కులు ధరించి పనిచేస్తున్నారు.
కోలుకుంటున్న వారే ఎక్కువ
రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 10,500 మంది కరోనా లక్షణాలతో గాంధీ దవాఖానలో చేరారు. ఇందులో 9,500 మంది కోలుకోగా, 800 మంది పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. అవసరమైన వారికి ప్లాస్మాథెరపీ చేస్తున్నారు.
దీర్ఘకాలిక రోగాలున్న వారూ..
గాంధీ దవాఖానలో చేరుతున్న వారిలో సగానికిపైగా కొవిడ్ లక్షణాలతోపాటు దీర్ఘకాలిక రోగాలున్నవారే. వారిలోనూ 90శాతానికి పైగా కోలుకుంటుండటం విశేషం. ఇలా కోలుకున్న వారి సంఖ్య దాదాపు 4,700 మంది వరకు ఉంది. వీరిలో హైబీపీ, మధుమేహం, క్యాన్సర్, నిమోనియా, పక్షవాతం, గుండె, కిడ్నీ, కాలేయ, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వారున్నారు. 320మందికిపైగా డయాలసిస్ పేషెంట్లు ఉన్నారు.
పసికందు నుంచి వృద్ధుల వరకు
పుట్టిన పసికందు మొదలు పండు ముదుసలి వరకు గాంధీ దవాఖానలో అందించిన వైద్యంతో కోలుకున్నారు. 96 ఏండ్ల వయస్సున్న వ్యక్తి ఇక్కడి చికిత్సతో బయటపడ్డారు. గాంధీలో ప్రసవానంతరం ఇద్దరు పసికందులకు వైరస్ సోకగా, కోలుకొని క్షేమంగా ఇండ్లకు చేరారు. మొత్తం 700 మంది చిన్నారులు కోలుకున్నారు. కరోనా సమయంలో ఇప్పటివరకు గాంధీలో 200కుపైగా డెలివరీలు అయ్యాయి.
ప్రైవేటు కంటే దీటైన వైద్యం
కరోనా పేషెంట్లను ముట్టుకోవడానికి కూడా భయపడుతున్న రోజుల్లో ఇక్కడ వైద్యం ప్రారంభించాం. అప్పటినుంచి దవాఖాన వైద్యులు, సిబ్బంది ఎంతో శ్రమిస్తున్నారు. దవాఖానలో చేరిన ప్రతి ఒక్కరి ప్రాణాలూ కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. ఇక్కడున్న వైద్యం ప్రైవేటులో కూడా దొరకదు. ఇప్పటివరకు 16 మందికి ప్లాస్మా ఇచ్చాం. లక్షణాలుంటే ఆలస్యం చేయక దవాఖానకు వెళ్లాలి.
- డాక్టర్ రాజారావు, గాంధీ సూపరింటెండెంట్