పది రెట్లు ప్రమాదం


  • మలేషియాలో బయటపడ్డ 

  • డీ614జీ రకం కరోనా వైరస్‌

  • ఇతర రకాల కన్నా 10 రెట్లు వేగంగా వ్యాప్తి

  • గతంలో ఐరోపా, అమెరికాలోనూ ఉనికి


 కరోనా వైరస్‌ రోజురోజుకూ మరింత ప్రమాదకరంగా మారుతున్నది. కొవిడ్‌-19 వైరస్‌కు చెందిన డీ614జీ రకం ఉత్పరివర్తనం (మ్యుటేషన్‌)ను తాజాగా మలేషియాలోనూ గుర్తించినట్టు పరిశోధకులు వెల్లడించారు. ఈ జాతి వైరస్‌ పది రెట్ల వేగంతో ఇతరులకు సోకుతుందని తెలిపారు. ఈ తరహా మ్యుటేషన్‌ను ఇప్పటికే పలు దేశాల్లో గుర్తించినట్టు వివరించారు. భారత్‌, ఫిలిప్పీన్స్‌ నుంచి ఇటీవల మలేషియాకు వచ్చిన వ్యక్తుల ద్వారా ఈ మ్యుటేషన్‌ వ్యాప్తి చెందినట్టు, దేశంలోని రెండు ప్రాంతాల్లో దీన్ని గమనించినట్టు తెలిపారు. తాజాగా బయటపడిన వైరస్‌ ఉత్పరివర్తనాన్ని కట్టడి చేయాలంటే వ్యాక్సిన్‌ల అభివృద్ధికి ఇప్పటివరకూ చేసిన అధ్యయనాలు సరిపోవని ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ జనరల్‌ నూర్‌ హిషమ్‌ అబ్దుల్లా తెలిపారు. ‘డీ614జీ రకం వైరస్‌ ఉత్పరివర్తనాన్ని తాజాగా మలేషియాలో గుర్తించాం. ముందు కంటే ఇంకా కచ్చితమైన జాగ్రత్తలను పాటించండి’ అని ఫేస్‌బుక్‌ వేదికగా ప్రజలకు సూచించారు. అయితే, డీ614జీ రకం ఉత్పరివర్తనం వల్ల ప్రస్తుతం అభివృద్ధిలో ఉన్న కరోనా టీకాలపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని ‘సెల్‌ ప్రెస్‌' జర్నల్‌ ఓ కథనంలో ప్రచురించింది. ఐరోపా, అమెరికాలో డీ614జీ తరహా మ్యుటేషన్‌ను ఇదివరకే గుర్తించామని, ఈ జాతి వైరస్‌తో వ్యాధి మరింత తీవ్రతరం అవుతుందనడానికి ఆధారాల్లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది.