ఒకే కుటుంబంలో 11 మందికి పాజిటివ్
హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): హైదరాబాద్లోని ఖాజానగర్లో ఉండే ఆరీఫ్ సయీద్ది ఉమ్మడి కుటుంబం. అన్నదమ్ములు కలిసి ఉండే ఆ ఇంట్లో మొత్తం 14మంది ఉంటారు. ఆరీఫ్ సయీద్(51) టీచర్గా పని చేసి ఇంట్లోనే ఉంటున్నారు. గత నెల 4న జ్వరం రావడంతో దగ్గర్లోని డాక్టర్ వద్దకు వెళ్లారు. అయినా తగ్గకపోవడంతో అనుమానం వచ్చింది. రెండు రోజుల తర్వాత టెస్టు చేసుకుంటే కరోనా అని తేలింది. ఆరీఫ్ తమ్ముడు ఆసిఫ్ సయీద్(41)తోపాటు అన్నదమ్ముల భార్యాపిల్లలు కలిపి కుటుంబంలోని 11మందికి వైరస్ సోకింది. వైరస్ సోకిన వారిలో 51 ఏండ్ల నుంచి 14 ఏండ్ల వరకు ఉన్నారు. వెంటనే యశోద హాస్పిటల్ కన్సల్టెంట్ ఫిజీషియన్ ఎంవీ రావును సంప్రదించారు. ఆరీఫ్కు కొంచెం ఇబ్బంది కావడంతో దవాఖానలో చేరాడు. మిగిలిన పది మంది ఇంట్లోనే ఉండి డాక్టర్ సూచనలు పక్కగా పాటించారు. పది రోజులు, రెండు వారాల తేడాతో అందరూ కరోనాను జయించారు. ఈలోపు ఆరీఫ్ సైతం దవాఖాన నుంచి డిచ్చార్జీ అయ్యాడు. కరోనా అని తెలిసి చాలా భయపడ్డామని డాక్టర్ సూచనలను కచ్చితంగా పాటించడంతో అందరం మామూలుగా అయ్యామని ఆసిఫ్ సయీద్ ‘నమస్తే తెలంగాణ’కు చెప్పారు.
ధైర్యమే పెద్ద మందు
‘లాక్డౌన్ నుంచి మేం చాలా జాగ్రత్తగా ఉంటున్నాం. పిల్లలను కూడా బయటికి పోకుండా అవగాహన కల్పించాం. అయినా మా అన్నయ్యకు జ్వరం వచ్చింది. తగ్గకపోవడంతో టెస్టు చేయిస్తే కరోనా అని తేలింది. తర్వాత మూడు రోజులకు మా వదినకు, మరో మూడు రోజులకు నా భార్యకు, ఆ తర్వాత నాకు, పిల్లలకు వరుసగా ఇలాగే అయ్యింది. మా అన్నయ్యకు కొంచెం ఇబ్బంది కావడంతో దవాఖానలో చేరారు. డాక్టర్ ఎంవీ రావు, ఆయన వైద్య బృందం సూచనలతో మేమంతా ఇంట్లోనే ఉన్నాం. సమయానికి మందులు వేసుకున్నాం. కషాయం తాగడం, ఆవిరి పట్టడం చేశాం. డాక్టర్ చెప్పిన ప్రకారం ఆహారం తీసుకున్నాం. ఒక్కొక్కరుగా అందరికీ కరోనా లక్షణాలు పోయాయి. పిల్లలకు త్వరగా నయమైంది. గరిష్టంగా రెండు వారాల్లోనే అందరం సాధారణ స్థితికి వచ్చాం. కరోనా అని తేలినప్పుడు బాగా భయపడ్డాం. ఎలా ఉంటుందో అని ఆలోచించాం. డాక్టర్ సూచనలతో ధైర్యం వచ్చింది. ధైర్యంగా ఉండి కరోనాను జయించాం. కరోనా సోకగానే ఎవరూ ఆందోళనపడవద్దు. ధైర్యంగా ఉండాలి. ఇదే పెద్ద మందు’ అని ఆసిఫ్ వివరించారు.