కార్పొరేట్‌ తరహాలో వైద్యం

- ఎక్సైజ్‌ శాఖ మంత్రి డా.వీ.శ్రీనివాస్‌గౌడ్‌ 


మహబూబ్‌నగర్‌ (ఆరోగ్యజ్యోతి) : కార్పొరేట్‌ దవాఖానల్లో ఇస్తున్న వైద్యానికి ఏ మాత్రం తగ్గకుండా మహబూబ్‌నగర్‌లో వైద్య సేవలు అందిస్తున్నామని ఎక్సైజ్‌ శాఖ మంత్రి డా.వీ.శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని పద్మావతికాలనీ,రాజేందర్‌నగర్‌, వెంకటేశ్వర కాలనీల్లో బుధవారం ఉదయం 7 గంటలకు పర్యటించారు. కంటైన్మెంట్‌ జోన్‌లలో చేపడుతున్న శానిటేషన్‌ పనులను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వచ్చినంత మాత్రాన గాబరా పడాల్సిన అవసరం లేదన్నారు. కరోనా చికిత్స కోసం జిల్లా జనరల్‌ దవాఖానలో 220 పడకల ప్రత్యేక వార్డు ప్రారంభించినట్లు తెలిపారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలన్నారు. మహబూబ్‌నగర్‌లో ఆక్సిజన్‌ ప్లాంట్‌ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి వార్డులో పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని, కంటైన్మెంట్‌ జోన్లలో శానిటేషన్‌ ప్రత్యేకంగా చేయాలని మున్సిపల్‌ అధికారులకు ఆదేశించారు. పట్టణాభివృద్ధే ముందున్న లక్ష్యమని, ఇప్పటికే రోడ్డు విస్తరణ, చౌరస్తాల అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. మహబూబ్‌నగర్‌ను అన్ని రంగాల్లో ముందుంచుతామన్నారు. మంత్రి వెంట అదనపు కలెక్టర్‌ రాకేశ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ కేసీ నర్సింహులు, వైస్‌ చైర్మన్‌ తాటిగణేశ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సురేందర్‌, కౌన్సిలర్లు పటేల్‌ప్రవీణ్‌, కట్టారవికిషన్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్‌ విఠల్‌రెడ్డి, నాయకులు తిరమలవెంకటేశ్‌, మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు.