మహబూబాబాద్: జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. 74వస్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో ఆమె జెండా వందనం చేశారు. అనంతరం కలెక్టరేట్లో స్థానిక ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్నాయక్, జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఆంగోతు బిందు, కలెక్టర్ వీపీ గౌతమ్, ఎస్పీ కోటిరెడ్డి, ఇతర జిల్లా అధికారులతో కలిసి కొవిడ్- 19పై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ దవాఖానకు కొత్తగా ఐదు డాక్టర్ పోస్టులు మంజూరు అయ్యాయని మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడించారు. కరోనా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కావాల్సిన వైద్య సామాగ్రి, వసతులు కల్పిస్తున్నామని, వీటితోపాటు అదనపు వైద్య సిబ్బందిని కూడా మంజూరు చేస్తున్నామని తెలిపారు. ప్రజలు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కోరారు. ప్రభుత్వ యంత్రాంగం కూడా కరోనా వైరస్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని, వైద్యంతో పాటు వారికి మానసిక స్థైర్యం కల్పించాలన్నారు. అనంతరం కొవిడ్ బాధితులకు ఫ్రూట్ జ్యూస్ టిన్స్ పంపిణీ చేశారు.