ప్రమాదం జరిగితే రోగులను కాపాడే వీలుందా?
తనిఖీలకు ప్రత్యేక బృందాన్ని నియమించిన అగ్నిమాపకశాఖ
విజయవాడ ఘటన నేపథ్యంలో అప్రమత్తం
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా చికిత్సలు చేస్తున్న ఆసుపత్రులు సహా అన్ని దవాఖానాలపై అగ్నిమాపకశాఖ నిఘా పెంచింది. అనూహ్యంగా ఏదైనా ప్రమాదం జరిగితే తట్టుకునే యంత్రాంగం ఆయా ఆసుపత్రులకు ఉందా? నిబంధనలు పాటిస్తున్నాయా? అనే కోణంలో ఆరా తీస్తోంది. గడచిన పదేళ్ల కాలంలో రాష్ట్రంలో నాలుగు ఆసుపత్రుల్లో అగ్నిప్రమాదాలు జరిగాయి. 2010లో సోమాజిగూడలోని ప్రైవేటు ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 50 మందికిపైగా రోగులు గాయపడగా, ఒకరు అక్కడిక్కడే మరణించారు. 2017లో వరంగల్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో జరిగిన ఘటన ఇద్దర్ని బలితీసుకుంది. చివరిగా గత ఏడాది ఎల్బీనగర్లోని షైన్ చిన్నపిల్లల ఆసుపత్రిలో జరిగిన ప్రమాదం ఓ చిన్నారి ప్రాణం తీసింది. అప్పట్నుంచి అగ్నిమాపకశాఖ ఆసుపత్రులపై ప్రత్యేక దృష్టి సారించినప్పటికీ అడపాదడపా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. గత గురువారం అహ్మదాబాద్లో, తాజాగా విజయవాడలో కరోనా ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం జరిగిన నేపథ్యంలో అగ్నిమాపక తెలంగాణ విపత్తు నివారణశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రత్యేక బృందాన్ని నియమించి ఆసుపత్రుల వారీగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. త్వరితగతిన తనిఖీలు పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. ‘‘రాష్ట్రంలో 91 ప్రైవేటు, 56 ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సలు చేస్తున్నారు. వీటన్నింటిలోనూ తనిఖీలు నిర్వహిస్తాం. ముఖ్యంగా ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే రోగులను కాపాడే మార్గాలున్నాయా? లేదా? అనేది పరిశీలించాల్సిందిగా తనిఖీ బృందానికి సూచించాం.