మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ మెడికల్‌ కళాశాల కు 150 ఎంబీబీఎస్‌ సీట్లు

మహబూబ్‌నగర్‌(ఆరోగ్యజ్యోతి): మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ఐదో బ్యాచ్‌కు 150ఎంబీబీఎస్‌ సీట్లు మంజూరు కావడంపట్ల ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హర్షం వ్యక్తం చేశారు. బుధవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో 150 మంది ఎంబీబీఎస్‌ విద్యార్థులు విద్యను అభ్యసించేందుకు రెన్యూవల్‌ అనుమతి తీసుకోవడం ఇది నాలుగోసారన్నారు. అనంతరం ప్రభుత్వ జనరల్‌ దవాఖానకు నూతనంగా నియామకమైన ఏడుగురు స్టాఫ్‌నర్సులకు నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల డైరెక్టర్‌ డా.పుట్టా శ్రీనివాస్‌ ఉన్నారు.